AP Crime: విశాఖపట్నంలో చోటుచేసుకున్న దారుణ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రియురాలిని హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్లో దాచిన ఈ ఘటనలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.. పోలీసుల వివరాల ప్రకారం, నేవీలో టెక్నీషియన్గా పనిచేస్తున్న రవీంద్రకు మూడేళ్ల క్రితం ఒక డేటింగ్ యాప్ ద్వారా మౌనిక పరిచయమైంది. మౌనిక పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తూ, పార్ట్టైమ్గా ఈవెంట్ ఆర్గనైజర్గా కూడా పనిచేస్తోంది. ఈ పరిచయం తరువాత ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడింది.
Read Also: New Model Cars: ఏప్రిల్ నెలలో విడుదల కాబోయే కొత్త కార్లు ఇవే..
అయితే, ఏడాది క్రితం రవీంద్ర రాజాం ప్రాంతానికి చెందిన మరో మహిళను వివాహం చేసుకున్నాడు. గాజువాకలోని ఎల్వి నగర్, కీర్తి ఎంక్లేవ్ అపార్ట్మెంట్లో అద్దెకు నివసిస్తున్నాడు. వివాహం తరువాత అతని భార్య గర్భవతి కావడంతో పుట్టింటికి పంపించాడు. అప్పటి నుంచి రవీంద్ర తన స్నేహితుడు, సోదరుడితో కలిసి అదే ఫ్లాట్లో ఉంటున్నాడు. ఇక, అపార్ట్మెంట్ నివాసుల ప్రకారం, మౌనిక తరచూ రవీంద్ర ఇంటికి వచ్చి వెళ్లేది. ఈ క్రమంలో డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. మౌనిక తనను డబ్బుల కోసం వేధించేదని రవీంద్ర పోలీసులకు తెలిపాడు. సుమారు రూ.3.5 లక్షలు దఫదఫాలుగా ఇచ్చినట్లు వెల్లడించాడు.
ఈ వివాదాలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో, మౌనికను హత్య చేయాలని రవీంద్ర ముందుగానే పథకం రచించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక ఆన్లైన్ డెలివరీ యాప్ ద్వారా ముందుగానే కత్తి ఆర్డర్ చేసినట్లు సమాచారం. అనంతరం మౌనికను ఇంటికి పిలిపించి, ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగి, బాత్రూమ్లో కత్తితో దారుణంగా హత్య చేశాడు. హత్య అనంతరం, మృతదేహాన్ని ముక్కలుగా నరికి కొంత భాగాన్ని ఫ్రిజ్లో దాచినట్లు పోలీసులు గుర్తించారు. కొన్ని శరీర భాగాలను ప్లాస్టిక్ కవర్లలో చుట్టి బయటకు తీసుకెళ్లి దహనం చేసినట్లు కూడా తెలిసింది. అనుమానం రాకుండా ఉండేందుకు ఇంట్లో సువాసన ద్రవ్యాలు పిచికారీ చేసి, రక్తపు మరకలను పూర్తిగా శుభ్రం చేసినట్లు సమాచారం.
ఈ ఘటన గురించి రవీంద్ర తన స్నేహితులకు తెలియజేయగా, వారు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం రవీంద్ర పోలీసులకు లొంగిపోయాడు. ఇక, మౌనిక తండ్రి గోపాలరావు మాత్రం రవీంద్ర ఆరోపణలను ఖండించారు. తన కుమార్తెను ప్రేమ పేరుతో మోసం చేసి కావాలనే హత్య చేశాడని ఆయన ఆరోపించారు. తన కుమార్తెకు డబ్బుల కోసం ఎవరినీ వేధించే అవసరం లేదని, ఆమె స్థిరమైన ఉద్యోగంలో ఉందని తెలిపారు. అయితే, పోలీసులు ఈ కేసును అత్యంత ప్రాధాన్యంతో తీసుకుని ఆరు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహ అవశేషాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఇంకా తలతో పాటు కొన్ని శరీర భాగాలు గల్లంతైనట్లు సమాచారం. కేసులో కీలక ఆధారాలుగా నిందితుడు, మృతురాలి మొబైల్ ఫోన్లు, కాల్ డేటా, వాట్సాప్ చాట్లు, సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తి, ప్లాస్టిక్ కవర్లు, సువాసన ద్రవ్యాల బాటిళ్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ దారుణ ఘటనపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. రవీంద్ర వర్షన్, మౌనిక కుటుంబ సభ్యుల వాదనలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది.