Theft Gangs: తెలుగు రాష్ట్రాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. ముఠాలుగా ఏర్పడి మరీ దోచుకు వెళ్తున్నారు. ఆదమరిస్తే చాలు ఆసాంతం సొత్తు చోరీ చేసి జంప్ అవుతున్నారు. ఇళ్లు తాళం వేసి ఉంటే చాలు.. ఇంట్లోని వారు వచ్చే వరకు ఉన్నదంతా ఊడ్చుకెళ్తున్నారు. అంతే కాదు.. ఈ మధ్య నైస్గా ఇంట్లోకి సర్వీస్ పేరుతో చొరబడి కూడా చోరీలు చేస్తున్నారు. ఇలాంటి చోరీలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాలో బ్యాంక్ల దగ్గర చోరీలకు పాల్పడే మహా ముఠా హల్చల్ చేస్తుంది. సినీ ఫక్కీలో చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాలు విసురుతోంది ఓ ముఠా. బ్యాంకు ముందే కారు అద్దాలను ధ్వంసం చేసి 3 లక్షల రూపాయలు లూటీ చేసిన ఉదంతం బోధన్లో తీవ్ర కలకలం సృష్టించింది. జాడి జమాల్పూర్ గ్రామానికి చెందిన హరిబాబు వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. ఈ భూమికి సంబంధించిన డబ్బులు చెల్లించేందుకు కెనరా బ్యాంకులో 3 లక్షల రూపాయలు డ్రా చేసేందుకు వచ్చారు. బ్యాంకులో డబ్బులు డ్రా చేసి కారు డ్యాష్ బోర్డులో పెట్టి మరో బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకు ముందు కారు హరిబాబు నగదు డ్రా చేసినప్పటి నుంచి ఇద్దరు వ్యక్తులు బైక్పై ఆయన్ను అనుసరించారు. కారు పార్కింగ్ చేసి.. మరో బ్యాంకు కు వెళ్లడం చూసిన దొంగలు.. కారు ముందు భాగంలోని ఎడమ వైపు ఉన్న అద్దాలు ధ్వంసం చేసి… నగదు ఎత్తుకెళ్లారు. ఆ ముఠా చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దుండగులు ముఖాలు కనిపించకుండా జాగ్రత్త పడ్డట్లు సీసీ ఫుటేజ్ లో కనిపిస్తుంది. ఈ తరహా చోరీ కొద్ది రోజుల క్రితం బాన్సువాడ లో జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ చోరీ చేసింది ఇదే ముఠాగా పోలీసులు నిర్ధారణ కు వచ్చారు. డబ్బులు డ్రా చేసి.. కారులో పెట్టి మరో బ్యాంకుకు వెళ్లి వచ్చే లోపు నగదు లూటీ చేశారని బాధితుడు ఆవేదన చెందుతున్నారు.
READ MORE: Guntur Murder Case: మద్యం మాన్పించాలని కొడితే ప్రాణమే పోయింది.. భార్య చేతిలో భర్త హత్య!
సరిగ్గా నెల క్రితం బాన్సువాడలో ఓ వ్యక్తి బ్యాంకులో 8 లక్షలు డ్రా చేసి కారులో పెట్టి షాప్కు వెళ్లి వచ్చే లోపు.. కారు అద్దాలు ధ్వంసం చేసి లూటీ చేశారు. ఇప్పుడు బోధన్ ఇదే తరహాలో చోరీ చేయడం వెనుక ఆ ముఠా పనిగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మహారాష్ట్రకు చెందిన ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముఠాకు స్థానికంగా ఎవరు సహకరిస్తున్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలంలోని కమ్మవారిపల్లిలో భారీ చోరీ జరిగింది. పుల్లలచేరువులోని కమ్మవారిపల్లిలో మెడికొండ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దొంగలు.. ఇంటికి వేసిన తాళాన్ని పగలగొట్టి లోపలికి చొరబడి ఇంట్లో ఉన్న బీరువాను తెరిచి అందులో ఉన్న బంగారం, వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. ఈ చోరీలో దాదాపు 23 లక్షల రూపాయల విలువైన బంగారం మాయమైందని బాధితుడు పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. టెక్నికల్ ఎవిడెన్స్, ఆధారంగా అంతరాష్ట్ర దొంగలను పట్టుకున్నారు. ఇద్దరు దొంగలను నల్గొండ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారి నుంచి నేరానికి ఉపయోగించిన హోండా సిటీ కారు, 2 ఇనుప రాడ్లతోపాటు చోరీకి గురైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారని,వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు..
హైదరాబాద్లోని ఎల్బీనగర్ పరిధిలో ఓ దొంగను పట్టుకుని దేహశుద్ధి చేశారు స్థానికులు. ఆ తర్వాత అతన్ని పోలీసులకు అప్పగించారు. అమెజాన్లో ఉద్యోగం చేస్తూ ఓ యువకుడు దొంగగా మారి మహిళపై దాడి చేసి బంగారం దోచుకెళ్లే ప్రయత్నం చేశాడు. రాక్హిల్స్ కాలనీలోని శైలజా రెసిడెన్సీలో నివసిస్తున్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు ప్రవీణారెడ్డి ఇంట్లో ఈ ఘటన జరిగింది. అబ్రార్ అహ్మద్ అనే యువకుడు ఏసీ మెకానిక్గా నటిస్తూ ఫ్లాట్లోకి ప్రవేశించాడు. ఇంట్లో మహిళ ఒంటరిగా ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాత.. ఇనుప సుత్తితో ఆమె తలపై దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలి మెడలో ఉన్న సుమారు రెండున్నర తులాల బంగారు పుస్తెల తాడును తెంచుకుని నిందితుడు పరారయ్యాడు. గాయాలపాలైన మహిళ 100కు కాల్ చేయగా..వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను కామినేని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది.. ఘటనపై స్పందించిన ఎల్బీనగర్ పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కదలికలను ట్రాక్ చేసి కేవలం 2 గంటల వ్యవధిలోనే అతడిని పట్టుకుని అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి దొంగిలించిన బంగారు పుస్తెల తాడును స్వాధీనం చేసుకున్నారు.