Advocate Swapna Murder Case: రంగారెడ్డి జిల్లాలో అడ్వకేట్ స్వప్న మర్డర్ సంచలనం సృష్టించింది. భూమి కోసం సొంత అన్ననే ఆమెను అంతమొందించాడు. ప్రస్తుతం అరెస్టై జైలులో ఊచలు లెక్కబెడుతున్నారు. ఐతే స్వప్న మర్డర్ కేసులో మరిన్ని ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. అవి ఇప్పుడు మరింత సంచలనంగా మారాయి. కుటుంబ సభ్యులను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. స్వప్న హత్యని ప్రమాదంలా చిత్రీకరించి చెల్లిని వదిలించుకోవాలనుకున్న సొంత అన్న క్రూరత్వం వెనుక ఎన్నో ట్విస్టులు ఉన్నాయని పోలీసుల విచారణలో బయటపడింది. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో ఆమెపై రెండుసార్లు హత్యాప్రయత్నం జరిగింది.. కానీ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది.
READ ALSO: HYD SPA VYABHICHARAM: మసాజ్ థెరపిస్టుల పేరుతో యువతుల నియామకం.. క్రాస్ మసాజ్ చేయుస్తున్న ముఠాలు
స్వప్న కేసులో ఆమె అన్న రాజు మాత్రమే కాదు.. శేఖర్ అనే వ్యక్తి కూడా కీలక పాత్ర పోషించాడు. అతన్ని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. స్వప్న ఎక్కడ ఉంది? ఎటు వెళ్తోంది? అనే లైవ్ లొకేషన్ వివరాలను ఎప్పటికప్పుడు నిందితుడు, స్వప్న సొంత అన్న రాజుకు చేరవేసే బాధ్యతను శేఖర్ తీసుకున్నాడు. అలా పంపడంతోనే అన్న రాజుతోపాటు నిందితులంతా స్వప్నను మట్టుబెట్టగలిగారు. కారుతో ఢీకొట్టి ఆ తర్వాత కత్తులతో దాడి చేసి చంపేశారు. తీవ్ర గాయాలతో స్వప్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
ఇప్పటివరకు స్వప్న హత్య కేసులో అన్న రాజుతో పాటు వీరేశ్, శివ, శేఖర్ అనే నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు రాజు ఒప్పుకొన్న విషయాలు విస్తుగొలుపుతున్నాయి. స్వప్నను చంపడానికి గతంలోనే రెండుసార్లు స్కెచ్ వేసినట్లు అతను విచారణలో వెల్లడించాడు. కారుతో ఢీకొట్టి చంపాలని చూసినట్లు తెలిపాడు. ఏకంగా బుల్డోజర్తో తొక్కించి ప్రమాదంగా చిత్రీకరించాలని ప్లాన్ చేశాడు. అదృష్టవశాత్తూ ఆ రెండు ఘటనల నుంచి స్వప్న తప్పించుకోగలిగింది. ఐతే పలుమార్లు వరుస విఫలయత్నాల తర్వాత.. ఈసారి ఎలాగైనా చంపాలని గట్టిగా స్కెచ్చేశారు. మరిన్ని జాగ్రత్తలు తీసుకుని.. పక్కా స్కెచ్తో చంపేశారు. ముఖ్యంగా సీసీ కెమెరాలు లేని ప్రాంతాలను గుర్తించి, అక్కడ వెనుక నుంచి ఢీకొట్టి రోడ్డు ప్రమాదంగా నమ్మించాలని ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.