వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు కారులో లభ్యమైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహం కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసింది. ఐదు నెలల క్రితమే ఆయన వద్ద డ్రైవర్గా పని చేసి వదిలేసిన సుబ్రహ్మణ్యం.. రూ. 20 వేలు అప్పుగా తీసుకున్నట్టు కుటుంబీకులు చెప్పారు. నెలకు ఐదు వేలు చొప్పున డబ్బులు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నామని, ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అనంత బాబు తమని హెచ్చరించాడని వాళ్ళు తెలిపారు.
అయితే, నిన్న రాత్రి ఏదో పని ఉందని చెప్పి అనంత బాబు తమ అబ్బాయిని తీసుకువెళ్ళాడని, ఇప్పుడు అతని మృతదేహాన్ని వదిలి వెళ్ళాడని కుటుంబీకులు రోదిస్తున్నారు. ఏం జరిగిందని ప్రశ్నిస్తే.. రాత్రి ఫ్రెండ్ బైక్ ఇచ్చి టిఫిన్కి పంపించామని, వేగంతో నడపడంతో బైక్ స్తంభాన్ని ఢీ కొనడంతో చనిపోయినట్టు అనంత బాబు చెప్పాడన్నారు. అయితే, ఆయన స్పష్టంగా చెప్పకపోవడంతో తాము ఆందోళనకు దిగామన్నారు. శవాన్ని కారులో నుంచి త్వరగా దింపాలని ఆయన తమ మీద ఒత్తిడి కూడా చేశాడని సుబ్రహ్మణ్యం కుటుంబీలు వెల్లడించారు. తాము నిరాకరించి కారుకి అడ్డుగా పడుకోవడంతో, వేరే కారులో వెళ్లిపోయాడన్నారు.
తమ తనయుడు మృతిపై అనుమానాలున్నాయని చెప్తోన్న సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు, అనంత బాబుతో పాటు ఆయన సహచరులే కొట్టి చంపి ఉంటారని ఆరోపణలు చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం భార్య గర్భంతో ఉందని, పుట్టింట్లో ఉన్న ఆమెతో రాత్రి ఫోన్లో కూడా మాట్లాడాడని అన్నారు. తమకు అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలని వాళ్ళు కోరుతున్నారు. మరోవైపు, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.