Relationship: తమిళనాడులో మహిళ హత్య ఘటన సంచలనంగా మారింది. మహిళతో సంబంధాన్ని తెంచుకునేందుకు ఒక వ్యక్తి, తన ఇద్దరు గర్ల్ఫ్రెండ్స్తో కలిసి విషం ఇచ్చి, ఆ తర్వాత లోయలోకి తోసి హత్య చేశారు. రాష్ట్రంలోని సేలం జిల్లాలోని లోయలో 35 ఏళ్ల మృతదేహం కనుగొన్నారు. మృతురాలిని 35 ఏళ్ల లోగనాయగిగా గుర్తించారు. ఆమె ప్రియుడు, అతడి ఇద్దరు స్నేహితురాళ్లు కలిసి హత్య చేసి, 30 అడుగుల లోయలోకి పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని అనుకున్నారు. చివరకు పోలీసులకు ముగ్గురు చిక్కారు.
ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో పనిచేస్తూ హాస్టల్లో నివసిస్తున్న లోగనాయగి మార్చి 1 నుంచి కనిపించకుండా పోయింది. ఆమె అదృశ్యం తర్వాత పోలీసులు ఎంక్వైరీలో దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెతో చివరిసారిగా 22 ఏళ్ల అబ్దుల్ అజీజ్ అనే వ్యక్తి మాట్లాడినట్లు తేలింది. విచారించగా, లోగనాయకితో అబ్దుల్ సంబంధం బయటపడింది. ఇతడిని కలిసేందుకు ఆమె యెర్కాడ్కి వెళ్లినట్లు తేలింది.
Read Also: Uttam Kumar Reddy: కరీంనగర్ జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి సమీక్ష..
అబ్దుల్, అతడి ఇద్దరు స్నేహితురాళ్లు ఐటీ ఉద్యోగి అయిన తవియ సుల్తానా(22), నర్సింగ్ విద్యార్థిని మోనిషా(21)తో కలిసి లోగనాయకిని హత్య చేయడానికి కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది. లోగనాయగి అబ్దుల్తో విడిపోవడానికి ఇష్టపడలేదని, ఇస్లాం మతంలోకి మారి తన పేరును అల్బియాగా మార్చుకోవాలని కూడా నిర్ణయించుకున్నట్లు తేలింది. అయితే, అబ్దుల్కి అప్పటికే తావియా, మోనిషాలతో సంబంధం ఉంది.
పోలీసులు నివేదిక ప్రకారం.. ముగ్గురూ మాట్లాడుకుందామని లోగనాయగిని కలిశారు. ఆ తర్వాత ఆమెకు విషాన్ని శరీరంలోకి ఇంజెక్ట్ చేశారు. ఆమె స్పృహ కోల్పోయిన వెంటనే, వారు ఆమెను లోయలోకి విసిరి, ఆ నేరాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. నిందితులు అబ్దుల్, తవియా, మోనిషాలను పోలీసులు అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.