NTV Telugu Site icon

Karnataka: భార్యకి అక్రమ సంబంధం ఉందని అనుమానం.. 230 కి.మీ ప్రయాణించి ఆమెను చంపేసిన పోలీస్..

Karnataka

Karnataka

Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. తన భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానించిన భర్త ఆమెను దారుణంగా చంపేశాడు. ఆ తరువాత అతను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలో చర్చనీయాంశంగా మారింది. నిందితుడు ఆ రాష్ట్ర పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. భార్య మరణించగా.. నిందితుడైన భరత్ పురుగుల మందు తాగి చావుబతుకుల మధ్య ఉన్నాడు. విషాదం ఏంటంటే వీరిద్దరికి 11 రోజుల క్రితమే బాబు జన్మించాడు.

కిషోర్ అనే 32 ఏళ్ల వ్యక్తి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. కర్ణాటకలోని చామరాజనగర్‌లో నివసిస్తున్నాడు. అయితే అతని భార్య ప్రతిభ(24) 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోస్కోట్‌లోని తల్లిదండ్రుల ఇంటికి వెల్లింది. అనుమానం పెంచుకున్న అతను అంతదూరం ప్రయాణించి భార్యను పుట్టింటిలోనే చంపేశాడు. అంతకుముందు ప్రతిభకు కిషోర్ 150 సార్లు కాల్స్ చేశాడు. కానీ ఆమె సమాధానం ఇవ్వలేదు. కిషోర్ హత్యకు ముందు పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం అతని పరిస్థితి కూడా సీరియస్‌గా ఉంది.

కిషోర్, ప్రతిభలకు నవంబర్ 13, 2022న వివాహం జరిగింది. కాగా, తన భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో కిషోర్ తరుచుగా ప్రతిభ ఫోన్‌కి వచ్చే మెసేజులు, కాల్స్ పరిశీలించేవాడు. ఆమెతో మాట్లాడే ప్రతీ వ్యక్తి గురించి ఆరా తీసేవాడని, తన కాలేజీలోని మగవారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తరుచుగా ఆరోపించేవాడని పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రం కిషోర్ ప్రతిభకు ఫోన్ చేసి తిట్టాడు, ప్రతిభ ఏడవడంతో ఆమె తల్లి ఫోన్ తీసుకుని కాల్ డిస్ కనెక్ట్ చేసింది. ఈ గొడవలు బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని, కిషోర్ కాల్స్ కి ఆన్సర్ ఇవ్వద్దని ఆమె తల్లి సూచించింది. సోమవారం కిషోర్ తన భార్యకు 150 సార్లు ఫోన్ చేసినట్లు ప్రతిభ తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు.

సోమవారం ఉదయం కిషోర్, ప్రతిభ తల్లిదండ్రుల ఇంటికి వచ్చి పురుగుల మందు తాగాడు, ఆ తర్వాత దుపట్టాతో ఆమె గొంతుకోసి హత్య చేశాడు. హత్యకు ముందు ప్రతిభ ఉన్న గదిలోకి వెళ్లి గడియపెట్టాడు. అనుమానం వచ్చిన ప్రతిభ తల్లి తలుపు ఎంత కొట్టిన స్పందన రాలేదు. 15 నిమిషాల తర్వాత బయటకు వచ్చిన కిషోర్… నేను ఆమెను చంపానంటూ అరుస్తూ అక్కడి నుంచి పారిపోయాడు.