వైద్యం అనేది ప్రాణాలను కాపాడే వృత్తి. కానీ ఉత్తరప్రదేశ్లో కొందరు కేటుగాళ్లు దీన్ని ఒక మాఫియాగా మార్చేశారు. ఎటువంటి మెడికల్ డిగ్రీలు లేవు, కనీసం ఆపరేషన్ థియేటర్ నిబంధనలు తెలియవు. అయినా చేతిలో కత్తి పట్టి వందలాది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ శస్త్రచికిత్సలు చేసేశారు. కాన్పూర్ పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో ఈ చీకటి సామ్రాజ్యం గుట్టురట్టు అయింది.
ఈ కిడ్నీ రాకెట్లో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ముదస్సర్ అలీ. ఇతనికి ఎలాంటి వైద్య అర్హతలు లేవు. కానీ ఒక అనుభవజ్ఞుడైన సర్జన్ లాగా ఆపరేషన్లు చేసేవాడు. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఎవరినీ లోపలికి రానివ్వకుండా, కిడ్నీ తీయడం నుండి దానిని మరొకరికి అమర్చడం వరకు మొత్తం ప్రక్రియను తానే స్వయంగా పూర్తి చేసేవాడు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, ఇతను ఒక్కడే 100కు పైగా నకిలీ ఆపరేషన్లు చేసినట్లు తెలుస్తోంది.
ఈ ముఠాలో మరో కీలక వ్యక్తి రోహిత్. ఇతను కేవలం 12వ తరగతి (ఇంటర్మీడియట్) వరకు మాత్రమే చదివాడు. కానీ తెల్లటి కోటు, స్టెతస్కోప్ ధరించి డాక్టర్లా నటించేవాడు. దాదాపు 30కి పైగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు చేసినట్లు ఇతను అంగీకరించాడు. ఒక్కో ఆపరేషన్కు రూ. 18 లక్షల వరకు వసూలు చేసి, ఆ డబ్బును తన నెట్వర్క్లోని ఇతరులతో పంచుకునేవాడు. పోలీసుల నుండి తప్పించుకోవడానికి గోవా, షిమ్లా, మనాలీ మీదుగా నేపాల్కు పారిపోగా, ఎట్టకేలకు పోలీసులు అతన్ని పట్టుకున్నారు.
డబ్బు కోసం కిడ్నీ అమ్ముకోవాలనుకునే పేదలను, జీవితాన్ని కాపాడుకోవడానికి ఎంతైనా ఖర్చు చేసే ధనవంతులను ఈ ముఠా అనుసంధానించేది. ఒక బాధితుడికి ఇస్తామన్న రూ. 10 లక్షలు ఇవ్వకపోవడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ నకిలీ డాక్టర్లు చేసిన ఆపరేషన్ల వల్ల బాధితుల పరిస్థితి దారుణంగా మారింది. పారుల్ అనే మహిళ లక్షలు ఖర్చు చేసినా తీవ్రమైన ఇన్ఫెక్షన్ బారిన పడగా, మరో ఘటనలో ఒక మహిళ ఆపరేషన్ విఫలమై ప్రాణాలు కోల్పోయింది.
TCS Nashik Case: “నీ భార్యను నా దగ్గరికి పంపు”.. టీసీఎస్ నాసిక్ కేసులో సంచలన విషయాలు..
ఈ కిడ్నీ దందా కేవలం కాన్పూర్కే పరిమితం కాలేదు. పలు రాష్ట్రాల్లోని ప్రైవేట్ ఆసుపత్రులు, మధ్యవర్తులు మరియు నకిలీ డాక్టర్లతో కూడిన ఒక భారీ నెట్వర్క్ దీని వెనుక ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు బయటపడినవి కొన్ని మాత్రమేనని, ఇంకా వందలాది ఆపరేషన్లు రికార్డుల్లో లేకుండా జరిగి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో ఇంకా ఎంతోమంది కీలక వ్యక్తులు పరారీలో ఉన్నారు, వారి కోసం వేట కొనసాగుతోంది.