నేటి సమాజంలో అనాలోచిత నిర్ణయాలతో చేసే పనులు చివరికి జీవితంలో అంధకారాన్ని మిగుల్చుతాయి. పని చేయకుండా ఇంట్లోనే ఉంటున్న భర్తను పనికి పొమ్మంటే.. ఏకంగా ఇల్లాలి ప్రాణాన్ని తీశాడో దుర్మార్గుడు. అంతేకాకుండా ఆతరువాత తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో విభోర్ సాహు అనే వ్యక్తి డ్రైవర్గా పని చేస్తున్నాడు. అయితే 15 రోజులుగా అతడు పనికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. దీంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. దీంతో పనికి వెళ్లాలంటూ భార్య పదే పదే చెప్పింది. కాగా, శుక్రవారం విభోర్ సాహూ తల్లి, సోదరుడు ఒక మతపరమైన వేడుక నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లారు.
దీంతో ఇంట్లో ఉన్న భర్త విభోర్ సాహూను పనికి వెళ్లాలంటూ భార్య రీతు (23) మరోసారి పోరుపెట్టడంతో.. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహం చెందిన విభోర్ సాహూ కోపంగా కత్తెరతో భార్యను పొడిచాడు. ఆమె కింద పడి రక్తం మడుగుల్లో మరణించింది. అనంతరం సాహూ ఆత్మహత్య చేసుకున్నాడు. మరోవైపు ఇంటికి తిరిగి వచ్చిన తల్లి, సోదరుడు… సాహూ, అతడి భార్య చనిపోవడాన్ని గమనించి.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాంఝీ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ సహదేవ్రామ్ సాహు వెల్లడించారు.