ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుపతిలో మిస్సింగ్ కేసులు కలకలం రేపుతున్నాయి. గత మూడు రోజుల్లో ఐదుకు పైగా కేసులు నమోదయ్యాయి. తొలుత సత్యనారాయణపురానికి చెందిన ఓ మైనర్ బాలిక కనిపించకుండా పోయింది. ఆ అమ్మాయి పేరు మోనిషా. గుడికి వెళ్ళిన ఈ బాలిక, తిరిగి ఇంటికి రాలేదు. అలాగే.. చెన్నారెడ్డి కాలనీలో 8వ తరగతి చదువుతున్న వంశీ కృష్ణా ఐస్క్రీమ్ కోసం వెళ్ళి అదృశ్యమయ్యాడు. అనంతరం లక్ష్మీపురానికి చెందిన వివేక్ కూడా మిస్సింగ్ అంటూ మరో ఫిర్యాదు అందింది. తాజాగా ఓ వివాహిత మిస్ అయ్యింది.
ఆ వివాహిత పేరు రేణుక. పుట్టింటికి వచ్చిన ఆమె.. మొదటి ఐదు రోజులు కుటుంబసభ్యులతోనే ఉంది. కానీ, ఆరో రోజు నుంచి అదృశ్యమైంది. ఈమెకు 2019లో నంద్యాలకు చెందిన నీటిపారుదల శాఖ జూనియర్ అసిస్టెంట్ మహేశ్వర్తో వివాహమైంది. ఈమధ్య కాలంలో క్రికెట్ బెట్టింగ్లో మహేశ్వర్ 35 లక్షలు కోల్పోయాడు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన అతడు, అవి కట్టలేక ఈనెల 31వ తేదీన ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఈ క్రమంలోనే రేణుక ఇంటి నుంచి వెళ్లింది. కాసేపయ్యాక భర్త మహేశ్వర్ నుంచి రేణుక తండ్రి ఫోన్కు ఓ మెసేజ్ వచ్చింది.
‘మా ఇబ్బందులేవో మేము పడతాం.. మీరు ఆందోళన చెందొద్దు.. మా గురించి ఆలోచించొద్దు’ అంటూ మహేశ్వర్ మెసేజ్ పంపాడు. దీంతో ఆందోళన చెందిన రేణుక తండ్రి.. వెంటనే అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుల టెన్షన్తో ఎక్కడ భార్యాభర్తలిద్దరు ఆత్మహత్య చేసుకుంటారోనని భయాందోళనలకు గురవుతున్నారు.