Site icon NTV Telugu

Cyber Crime: ఎరువులంటూ ఎర వేశారు.. అందినకాడికి దోచేశారు!

Cyber Crime

Cyber Crime

Cyber Crime: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సైబర్ మోసం కలకలం రేపింది. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు సైబర్ నేరగాళ్ల మాయలో పడి ఏకంగా 24 లక్షల రూపాయలు కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రజలు సైబర్ నేరాలు బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఎరువులంటూ ఎర వేశారు. ఉచ్చులో చిక్కాక దరువేశారు. అందినకాడికి దోచేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మగటిపల్లికి చెందిన కొనుకు శ్రీనివాస్ ప్రభుత్వ పాఠశాలలో అసిస్టెంట్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి 24 లక్షల రూపాయలు కోల్పోయారు.

Perni Nani Quash Petition: పేర్ని నాని క్వాష్‌ పిటిషన్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

మొబైల్ ఫోన్‌లో ఫేస్‌బుక్ స్క్రోల్ చేస్తుండగా ఒక ఆకర్షణీయమైన లింక్ కనిపించింది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పేరుతో 10 లక్షల రూపాయల విలువైన ఎరువులు పంపిస్తామని.. వాటిని అమ్మితే 5 లక్షల రూపాయల లాభం వస్తుందని ఆ లింక్‌లో చూపించారు. అంటే సగానికి సగం లాభం. ఇది చూసిన తర్వాత ఎవరైనా ఆశపడకుండా ఉంటారా? అది నిజమని నమ్మిన శ్రీనివాస్.. ఆ లింక్‌లో లాగిన్ అయ్యారు.

ఇంకేముంది అప్పటికే కాచుకుని కూర్చున్న సైబర్ క్రిమినల్స్ వలకు చిక్కారు శ్రీనివాస్. కొద్ది సేపటికే సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి.. మీకు సరకు లారీ ద్వారా వస్తుందని.. ముందుగా కొన్ని ఛార్జీలు చెల్లించాలని చెప్పారు. మొదట చిన్న మొత్తాలుగా ప్రారంభమైన చెల్లింపులు, తర్వాత పెద్ద మొత్తాలుగా మారాయి. దఫాదఫాలుగా ఫోన్‌పే ద్వారా మొత్తం 24 లక్షల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేశారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసి, సరకు లారీలో వస్తోందని.. మరికొంత మొత్తం వేయాలని అడిగారు. ఈసారి అనుమానం వచ్చిన శ్రీనివాస్ వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు.

IND vs NAM: ఇషాన్ కిషన్ మెరుపులు.. హార్దిక్ ఫినిషింగ్ టచ్! నమీబియాకు భారీ టార్గెట్

పోలీసుల చొరవతో బ్యాంకు అధికారులు 24 లక్షల్లో 9 లక్షల రూపాయలను ఫ్రీజ్ చేశారు. మిగతా మొత్తాన్ని ట్రేస్ చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సమాజానికి మార్గదర్శకులు అయిన ఉపాధ్యాయులు కూడా సైబర్ మోసాలకు గురవడం బాధాకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయమై సిఐ భీమరాజు మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్ల మోసాలకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. గవర్నమెంట్ స్కీమ్ పేరుతో డబ్బు అడిగితే వెంటనే అనుమానించాలని తెలిపారు. అపరిచిత లింక్‌లపై క్లిక్ చేయకుండా, అధికారిక వెబ్‌సైట్ల ద్వారానే సమాచారం తెలుసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

Exit mobile version