Vijay Mallya: వేల కోట్లు ఎగగొట్టి పోయిన విజయ్ మాల్యా చుట్టూ మళ్లీ హాట్ టాపిక్.. ఎంత వసూలైంది? ఎంత మిగిలిందంటే?

  • రూ.14,131 కోట్లు రికవరీ..
  • ఇంకా రూ.6,203 కోట్ల బాకీ
  • అసలు లెక్కలు ఇవే
Vijay Mallya

Vijay Mallya

Vijay Mallya: పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా, భారత బ్యాంకుల మధ్య దాదాపు దశాబ్దంగా కొనసాగుతున్న న్యాయపోరాటం మరోసారి తెరపైకి వచ్చింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాల వ్యవహారంలో మాల్యా ఆస్తుల జప్తు, వేలం ద్వారా ఇప్పటివరకు రూ.14,131.60 కోట్ల విలువైన ఆస్తులను ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంకు తిరిగి ఇచ్చినట్లు మాల్యా తరఫు న్యాయవాదులు బాంబే హైకోర్టుకు తెలిపారు. ముంబై, బెంగళూరు, గోవా సహా పలు ప్రాంతాల్లో ఉన్న మాల్యాకు చెందిన చర, స్థిరాస్తులను విక్రయించడం ద్వారా ఈ మొత్తం రికవరీ జరిగినట్లు కోర్టుకు వివరించారు. ముంబై ఎయిర్‌పోర్టు సమీపంలోని కింగ్‌ఫిషర్ కార్యాలయం, గోవాలోని విలువైన ఆస్తులు, బెంగళూరులోని కార్యాలయాలు, ఇళ్లు, భూములను సైతం వేలం వేసినట్లు పేర్కొన్నారు.

మాల్యా అసలు వాదన ఏంటంటే

డెట్ రికవరీ ట్రిబ్యునల్ (DRT) లెక్కల ప్రకారం.. తనపై రూ.6,203 కోట్ల రుణ బకాయి ఉందని మాల్యా తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. దీనికి 11.5 శాతం వార్షిక వడ్డీ కూడా వర్తించిందని తెలిపారు. అయితే ఈ మొత్తంతో పోలిస్తే ఇప్పటికే రెట్టింపుకుపైగా ఆస్తులను బ్యాంకులు రికవరీ చేసుకున్నాయని మాల్యా వర్గం చెబుతోంది. గతంలో పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈడీ ద్వారా బ్యాంకులకు రూ.14,131.6 కోట్ల విలువైన ఆస్తులు తిరిగి అందినట్లు వెల్లడించిన విషయాన్ని మాల్యా తరఫు న్యాయవాదులు ప్రస్తావించారు. ఇదే అంశాన్ని ఆధారంగా చేసుకుని బ్యాంకులు అవసరానికి మించి రికవరీ చేశాయని మాల్యా పలుమార్లు వాదించారు. అయితే ఈ వ్యవహారంలో అసలు లెక్కలపై స్పష్టత లేకపోవడంతో బాంబే హైకోర్టు ఈడీ, ఎస్‌బీఐ నుంచి పూర్తి వివరాలను కోరింది. జప్తు చేసిన, వేలం వేసిన ఆస్తులు.. వాటి ద్వారా వచ్చిన మొత్తం.. బ్యాంకులకు వాస్తవంగా ఎంత మొత్తం చేరింది అనే వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్న ఈ వ్యవహారాన్ని ఇక ముగించాలని కోర్టు అభిప్రాయపడింది. ఇది ప్రధానంగా వ్యాపారపరమైన వివాదమని, ఇంతకాలం కేసు కొనసాగడం ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతోందని వ్యాఖ్యానించినట్లు సమాచారం.

మాల్యా వర్గం చెబుతున్న లెక్కలకు, బ్యాంకులు చూపిస్తున్న లెక్కలకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల ప్రకారం మొత్తం బకాయి సుమారు రూ.17,471 కోట్లు కాగా.. ఇప్పటి వరకు రూ.10,814.54 కోట్లు రికవరీ చేసినట్లు పేర్కొన్నాయి. ఇంకా సుమారు రూ.6,656.96 కోట్లు బకాయి ఉన్నట్లు బ్యాంకుల లెక్కలు చెబుతున్నాయి. దీంతో రూ.14,131.60 కోట్ల రికవరీ జరిగిందని ప్రభుత్వం చెబుతుంటే.. బ్యాంకులు మాత్రం రూ.10,814.54 కోట్లే వసూలైనట్లు ఎందుకు చెబుతున్నాయనే ప్రశ్న తలెత్తింది. మాల్యా తరఫు న్యాయవాదులు కూడా ఇదే అంశాన్ని బాంబే హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ మరో కీలక అంశం కూడా ఉంది. రూ.14,131.60 కోట్ల విలువైన ఆస్తులను బ్యాంకులకు తిరిగి ఇచ్చినంత మాత్రాన మాల్యా చట్టపరమైన మొత్తం బకాయి పూర్తిగా తీరిపోయిందని నిర్ధారించలేం. ఆస్తుల విలువ, వాటి వేలం ద్వారా వచ్చిన మొత్తం, వాస్తవంగా బ్యాంకుల ఖాతాల్లో జమ అయిన మొత్తం వేర్వేరు అంశాలు కావచ్చు అని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే మాల్యాపై ఇంకా ఎంత బకాయి ఉంది? ఇప్పటికే ఎంత మొత్తం రికవరీ అయింది? అనే దానిపై తుది స్పష్టత రావాలంటే ఈడీ, ఎస్‌బీఐ సమర్పించే నివేదికలు కీలకం కానున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం మాల్యా వర్గం ఒక లెక్కను, బ్యాంకులు మరో లెక్కను చెబుతున్న నేపథ్యంలో.. తదుపరి విచారణలో అసలు ఆర్థిక లెక్కలు ఎంత అనేది తేలే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.