Subhash Chandra: సుభాష్ చంద్రా చుట్టూ సీబీఐ ఉచ్చు.. రూ.1,322 కోట్ల లోన్ కేసులో ఎఫ్‌ఐఆర్

Subhash Chandra

Subhash Chandra

Subhash Chandra: ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్రా చిక్కుల్లో పడ్డారు. రూ.1,322 కోట్ల బ్యాంకు లోన్‌కు సంబంధించిన మోసం కేసులో ఆయనతో పాటు పలువురిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LICHFL) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా క్రిమినల్ కుట్ర, నమ్మకద్రోహం, క్రిమినల్ మిస్‌కండక్ట్ తదితర ఆరోపణలపై వారిపై కేసు నమోదైంది.

రూ.980 కోట్ల అసలు లోన్.. రూ.1,322 కోట్లకు చేరిన బకాయి

ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఫిర్యాదు ప్రకారం.. LICHFL నిందితులకు రెండు వేర్వేరు లోన్ సదుపాయాల కింద మొత్తం రూ.980 కోట్లను మంజూరు చేసింది. వడ్డీ, ఇతర ఛార్జీలు కలిపి ఈ మొత్తం బకాయి రూ.1,322 కోట్లకు చేరిందని తాజా ఫిర్యాదులో పేర్కొంది. మొదట రూ.500 కోట్ల రుణాన్ని వసంత్ సాగర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు వ్యాపార విస్తరణ కోసం మంజూరు చేసినట్లు వెల్లడించింది. పాన్ ఇండియా ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ఈ రుణానికి కో-బారోవర్‌గా ఉందని చెప్పింది. ఈ లోన్‌కు సుభాష్ చంద్రా 2018 మార్చి 28న వ్యక్తిగత హామీ ఇచ్చినట్లు తన ఫిర్యాదులో పేర్కొంది. ఇక రెండో విడతలో డిజిటల్ సబ్‌స్క్రైబర్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు రూ.480 కోట్ల రుణం ఇచ్చిమని వెల్లడించింది. అద్దె ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని ఈ రుణాన్ని మంజూరు చేసినట్లు తెలుస్తోంది. స్పిరిట్ ఇన్‌ఫ్రా పవర్ మల్టీ వెంచర్స్ ఇందులో కో-బారోవర్‌గా ఉందని చెప్పింది.

వేల కోట్ల నెట్‌వర్త్.. సర్టిఫికెట్లపై అనుమానాలు
లోన్ మంజూరులో సుభాష్ చంద్రా సమర్పించిన నెట్‌వర్త్ సర్టిఫికెట్లు కీలకంగా మారాయి. రూ.500 కోట్ల రుణం కోసం DIM & Co. 2018 మార్చి 28న జారీ చేసిన సర్టిఫికెట్‌లో చంద్రా నెట్‌వర్త్‌ను సుమారు రూ.59,113 కోట్లుగా చూపించినట్లు LICHFL ఆరోపించింది. అదే ఏడాది జూలై 6న మరో రూ.480 కోట్ల రుణం కోసం MPJ & Co. చార్టర్డ్ అకౌంటెంట్స్ జారీ చేసిన సర్టిఫికెట్‌లో ఆయన నెట్‌వర్త్ రూ.40,562 కోట్లుగా పేర్కొన్నట్లు ఫిర్యాదులో ఉంది. రెండు రుణ ఖాతాలు డిఫాల్ట్ కావడంతో విషయం ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ (IBC) కిందకు వెళ్లింది. ఈ దివాలా పరిష్కార ప్రక్రియలో సుభాష్ చంద్రా గతంలో చూపించిన నెట్‌వర్త్‌పై ప్రశ్నలు తలెత్తినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. లోన్లు పొందే సమయంలో భారీగా చూపించిన నెట్‌వర్త్‌ను అనంతరం జరిగిన న్యాయపరమైన ప్రక్రియలో ఆయన అంగీకరించలేదని LICHFL ఆరోపించింది.

రూ.59 వేల కోట్ల నుంచి రూ.31.79 కోట్లకు..
ఈ కేసులో నెట్‌వర్త్‌కు సంబంధించిన వ్యత్యాసమే ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. 2024లో సుభాష్ చంద్రా తన నెట్‌వర్త్ రూ.31.79 కోట్లు మాత్రమే అని వెల్లడించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు.. 2017-18లోనూ తన నెట్‌వర్త్ రూ.40 వేల కోట్లకు మించి లేదని ఆయన చెప్పినట్లు సమాచారం. దీంతో అప్పట్లో సమర్పించిన నెట్‌వర్త్ సర్టిఫికెట్లు ఎలా సిద్ధమయ్యాయి? వాటిలో పేర్కొన్న భారీ మొత్తాలు వాస్తవమేనా? రుణం పొందేందుకు తప్పుడు సమాచారం లేదా పత్రాలను ఉపయోగించారా? అనే కోణాల్లో సీబీఐ తాజాగా దర్యాప్తు చేయనుంది. ఈ వ్యవహారంలో సుభాష్ చంద్రాతో పాటు మరెవరెవరి పాత్ర ఉంది? నెట్‌వర్త్ సర్టిఫికెట్ల వెనుక ఉన్న అసలు వ్యవహారం ఏంటి? అనే అంశాలపై కూడా సీబీఐ విచారణ కొనసాగించనుంది.