దేశీయ స్టాక్ మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభం అయిన దగ్గర నుంచి మార్కెట్ కుదేల్ అయిపోతుంది. తాజాగా ఈ వారం ప్రారంభంలో కూడా మార్కెడ్ ఢమాల్ అయింది. సోమవారం ఉదయం భారీ నష్టాలతో మార్కెట్ ప్రారంభమైంది. ప్రస్తుతం సెన్సెక్స్ 2,321 పాయింట్లు నష్టపోయి 76, 596 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 686 పాయింట్లు నష్టపోయి 23, 764 దగ్గర కొనసాగుతోంది.
నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, ఆసియన్ పెయింట్స్, ఎల్ అండ్ టీ, అదానీ పోర్ట్స్ ప్రధాన నష్టాలను చవిచూడగా.. ఒఎన్జీసీ, కోల్ ఇండియా లాభాల్లో ఉన్నాయి.
మధ్యప్రాచ్య యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. గత వారమంతా లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఈ వారం కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రస్తుతం ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. దీంతో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తే సూచనలు కనిపించడంతో మార్కెట్ బెంబేలెత్తిపోతుంది. ఈ పరిస్థితి ఎంత కాలం ఉంటుందో చూడాలి.