వ్యాపారం ఏదైనా అంబానీల తర్వాతే.. ఏ వ్యాపారం చేసినా.. దానిని లాభాల బాట పట్టించడంలో ముఖేష్ అంబానీ ముందు వరుసలో ఉంటారు.. తన సోదరుడు కొన్ని వ్యాపారాల్లో విఫలం అయినా.. ముఖేష్ మాత్రం పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా సాగుతోంది.. అదే ఆయనను ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలోనూ చేర్చింది.. తాజాగా, మరో దిగ్గజ సంస్థ రిలయన్స్ చేతికి వచ్చింది.. ప్రీమియం లోదుస్తుల రిటైల్ సంస్థ క్లోవియాలో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. క్లోవియా మాతృసంస్థ పర్పుల్ పాండ్ ఫ్యాషన్స్లో 89 శాతం వాటాలను రూ. 950 కోట్లకు దక్కించుకుంది. ఇక, మిగతా వాటాలు కంపెనీ వ్యవస్థాపక సభ్యులు, మేనేజ్మెంట్ దగ్గర ఉన్నాయి.
Read Also: AP Assembly: నేడు కీలక బిల్లులకు ఆమోదం..
ఇప్పటికే జివామె, అమాంటే బ్రాండ్లను దక్కించుకున్న ఆర్ఆర్వీఎల్కు తాజాగా క్లోవియా కొనుగోలుతో ఇన్నర్ వేర్ సెగ్మెంట్లో మరింత విస్తరించినట్టు అయ్యింది… పంకజ్ వెర్మాని, నేహా కాంత్, సుమన్ చౌదరి కలిసి 2013లో క్లోవియాను ప్రారంభించిన విషయం తెలిసిందే కాగా.. తాజా పరిణామాలపై రెండు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి.. వినియోగదారులకు అత్యుత్తమ ఉత్పత్తులు అందిచడమే తమ లక్ష్యమని.. అందుకే క్లోవియా బ్రాండ్ను కూడా తమ పోర్ట్ఫోలియోలో చేర్చామని ఆర్ఆర్వీఎల్ డైరెక్టర్ ఈషా అంబానీ వెల్లడించారు.