కేఫ్ కాఫీడేలను నిర్వహిస్తున్న కాఫీ డే ఎంటర్ప్రైజెస్కు క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ రూ.26 కోట్ల జరిమానా విధించింది. 45 రోజుల్లోగా ఈ మొత్తం చెల్లించాలని ఆదేశించింది. అనుబంధ సంస్థల నుంచి ప్రమోటర్ల కంపెనీలకు నిధులు మళ్లించారనే ఆరోపణలతో ఈ ఫైన్ వేసింది. మైసూర్ అమాల్గమేటెడ్ కాఫీ ఎస్టేట్స్ లిమిటెడ్ (ఎంఏసీఈఎల్), దాని సంబంధించిన కంపెనీల నుంచి రావాల్సిన బకాయిలన్నింటినీ, వడ్డీతో కలిపి వసూలు చేసేందుకు చర్యలు చేపట్టాలని నిర్దేశించింది. బకాయిల వసూలు నిమిత్తం సమర్ధమైన చర్యలు చేపట్టేందుకు, ఒక స్వతంత్ర న్యాయ సంస్థను నియమించుకోవాలని సూచించింది. కాఫీ డే ఎంటర్ప్రైజెస్కు చెందిన ఏడు అనుబంధ సంస్థల నుంచి కాఫీ డే ప్రమోటరుకు చెందిన మైసూర్ అమాల్గమేటెడ్ కాఫీ ఎస్టేట్కు రూ.3,535 కోట్లు మళ్లించారని సెబీ గుర్తించింది.
Sourav Ganguly: తన బయోపిక్ తానే రాస్తున్న గంగూలీ..స్క్రిప్ట్ ఫైనల్
ఆ ఏడు అనుబంధ సంస్థలు- కాఫీ డే గ్లోబల్, టాంగ్లిన్ రిటైల్ రియాల్టీ డెవలప్మెంట్స్, టాంగ్లిన్ డెవలప్మెంట్స్, గిరి విద్యుత్ (ఇండియా), కాఫీ డే హోటల్స్ అండ్ రిసార్ట్స్, కాఫీ డే ట్రేడింగ్, కాఫీ డే ఎకాన్. ‘ఎంఏసీఈఎల్కు ఏడు అనుబంధ సంస్థల నుంచి బదిలీ చేసిన నిధులు వి.జి.సిద్దార్ధ, ఆయన కుటుంబీకులు, సంస్థలకు బదిలీ అయ్యాయని సెబీ పేర్కొంది. బదిలీ చేసిన రూ.3,535 కోట్లలో.. 2022 సెప్టెంబరు 30 నాటికి రూ.110.75 కోట్లనే అనుబంధ సంస్థలు వసూలు చేయగలిగాయని సెబీ పేర్కొంది. అనైతిక వ్యాపార విధానాలు, మోసపూరిత కార్యకలాపాలు, నిబంధనల ఉల్లంఘనను పరిగణనలోకి తీసుకుని, రూ.25 కోట్ల జరిమానాను సెబీ విధించింది. అలాగే నమోదిత, వెల్లడి నిబంధనల ఉల్లంఘనకు గాను మరో రూ.1 కోటి విధించింది.