మీరు క్రిడెట్ కార్డులు వాడుతున్నారా? అయితే మీరు అలర్ట్ కావాల్సిందే. ఎందుకంటే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కొన్ని మార్పులు రాబోతున్నాయి. అవేంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.
క్రెడిట్ కార్డుల విషయంలో ఆయా బ్యాంకులు మార్పులు, చేర్పులు చేశాయి. కొత్త రూల్స్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. రివార్డులు, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ విషయంలో బ్యాంకులు మార్పులు చేపట్టాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్.. వంటి ప్రధాన బ్యాంకులు లాంజ్ యాక్సెస్, రివార్డ్ పాయింట్ల విషయంలో కీలక మార్పులు తీసుకొస్తున్నాయి. మరో వారంలోనే ఈ రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఆవేంటో ముందే తెలుసుకుని అలర్ట్ అవ్వండి.
ఎస్బీఐ
ప్రముఖ ప్రభుత్వ రంగానికి చెందిన ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్ల విధానాల్లో మార్పు చేసింది. ఇప్పటివరకు అద్దె చెల్లింపులపై రివార్డ్ పాయింట్లను అందిస్తున్న బ్యాంక్.. ఇకపై ఆ తరహా రివార్డులను నిలిపివేయనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. ఎస్బీఐ అందిస్తున్న AURUM, SBI కార్డ్ ఎలైట్, సింప్లీ క్లిక్ ఎస్బీఐ కార్డులు వినియోగిస్తున్న వారిపై ఈ ప్రభావం ఉండనుంది.
ఐసీఐసీఐ..
ఇక ఐసీఐసీఐ కూడా పలు మార్పులు చేసింది. కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ విషయంలో నిబంధనల్ని ఐసీఐసీఐ బ్యాంక్ సవరించింది. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఈ సదుపాయం పొందాలంటే మునుపటి త్రైమాసికంలో కార్డ్ ద్వారా కనీసం రూ.35,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. కోరల్ క్రెడిట్ కార్డ్, మేక్ మై ట్రిప్ ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డ్ సహా వివిధ రకాల కార్డులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఈ మార్పులు కూడా కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి.
యస్ బ్యాంక్
ఐసీఐసీఐ బ్యాంక్ తరహానే యస్ బ్యాంక్ కూడా లాంజ్ యాక్సెస్లో నిబంధనల్ని సవరించింది. ఏప్రిల్ 1 నుంచి ఏ త్రైమాసికంలో లాంజ్ సదుపాయం పొందాలన్నా అంతకు మునుపటి త్రైమాసికంలో కార్డ్ ద్వారా కనీసం రూ.10,000 వెచ్చించాల్సి ఉంటుందని పేర్కొంది.
యాక్సిస్ బ్యాంక్
ఇక మరో ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ అందిస్తున్న మాగ్నస్ క్రెడిట్ కార్డ్పై రివార్డ్ పాయింట్లు, లాంజ్ యాక్సెస్తో పాటు వార్షిక రుసుముల్లో కీలక మార్పుల్ని తీసుకొచ్చింది. బీమా, గోల్డ్/ఆభరణాలు, ఇంధనం కోసం క్రెడిట్ కార్డ్ ద్వారా జరిపే చెల్లింపులపై ఇక నుంచి ఎలాంటి రివార్డ్ పాయింట్లూ ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఇక ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందాలంటే మూడు నెలల్లో కనీసం రూ.50,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాగే దేశీయ, అంతర్జాతీయ లాంజ్ల్లోకి కాంప్లిమెంటరీ గెస్ట్ సందర్శనల సంఖ్యను కూడా ఏడాదికి 8 నుంచి 4కు తగ్గించనుంది. ఏప్రిల్ 20 నుంచి ఈ కొత్త మార్పులు అమల్లోకి వస్తాయని బ్యాంక్ తెలిపింది.
ఇది కూడా చదవండి: Supreme Court: తమిళనాడు గవర్నర్ కోర్టును ధిక్కరిస్తున్నాడు.. కేంద్రం ఏం చేస్తుందని సుప్రీం ఫైర్..