రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టే పెట్టుబడులు భవిష్యత్తుకు భద్రతను ఇస్తాయని చాలామంది నమ్ముతారు. పెద్దలు కూడా తమ పిల్లలకు ఎప్పుడూ ఒక చిన్న స్థలాన్నయినా కొని ఉంచమని.. అది ఎప్పటికైనా మీకు ఆదుకుంటుందని పదే పదే సూచిస్తుంటారు. ఈ మాటలు ఎంత నిజమో నిరూపించే ఒక ఆసక్తికరమైన ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ ఆసక్తికరమైన విషయాన్ని స్టాక్ మార్కెట్ ట్రేడర్ అయిన స్వప్నిల్ కొమావర్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, సుమారు 36 ఏళ్ల క్రితం అంటే 1990వ సంవత్సరంలో ఆయన మేనమామ తన సొంత ఊరిలో నాలుగు ఎకరాల భూమిని రూ. 60 వేలకే కొనుగోలు చేశారు. అప్పట్లో ఆ భూమి విలువ అంతంత మాత్రమే. అయితే, కాలక్రమంలో ఆ ఊరు కొత్త జిల్లా కేంద్రంగా మారడం, చుట్టుపక్కల ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందడంతో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి.
Also Read:Google Map: గూగుల్ మ్యాప్స్లో సరికొత్త విప్లవం.. ఇకపై మ్యాప్స్తో మాట్లాడవచ్చు..
ఈ మార్పుల వల్ల ఆ భూమికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దీనిని గమనించిన ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థ ‘డీ-మార్ట్’, ఆయన వద్ద ఉన్న నాలుగు ఎకరాల భూమిలో రెండు ఎకరాలను రూ. 25 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఈ మొత్తంతో ఆ వ్యక్తి జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఆ రూ. 25 కోట్లను ఆయన ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడిగా పెట్టారు. దీని ద్వారా ప్రస్తుతం ఆయనకు నెలకు దాదాపు రూ. 14.50 లక్షల వడ్డీ ఆదాయం వస్తోంది. విశేషం ఏమిటంటే, ఇంకా రెండు ఎకరాల స్థలం ఆయన వద్దనే మిగిలి ఉంది.
ఈ కథనం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. భూమిని దశాబ్దాల పాటు కాపాడుకోవడం సామాన్యమైన విషయం కాదని, ఆయన ఓపికకు ఫలితం దక్కిందని నెటిజన్లు ప్రశంసించారు. అయితే.. ఇంత భారీ మొత్తానికి వచ్చే పన్నులు, ఇతర ఖర్చుల గురించి కూడా కొందరు నెటిజన్లు ఆసక్తికరంగా ప్రశ్నించారు. మొత్తానికి.. సరైన సమయంలో చేసిన పెట్టుబడి, దానికి కాలం కలిసి రావడం ఒక వ్యక్తి జీవితాన్ని ఎంతలా మార్చేస్తుందో చెప్పడానికి ఈ సంఘటన ఒక నిదర్శనంగా నిలిచింది.