గుజరాత్ లోని గిఫ్ట్ సిటీ (GIFT City) అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా ఎలా ఎదుగుతోంది, పెట్టుబడిదారులకు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందో పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. ఇన్నాళ్లూ విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే భారతీయులు సింగపూర్ లేదా దుబాయ్ వంటి దేశాలపై ఆధారపడాల్సి వచ్చేది. అక్కడ పెట్టుబడి పెట్టాలంటే ఎంతోమంది మధ్యవర్తులు, కఠినమైన నిబంధనలు, ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పనిగా ఉండేది. కానీ ఇప్పుడు మన దేశంలోనే ఉన్న ‘గిఫ్ట్ సిటీ’ ఈ పరిస్థితిని మారుస్తోంది. విదేశీయులు లేదా ఎన్ఆర్ఐలు (NRIs) భారత్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎదురయ్యే పన్నులు, కరెన్సీ మార్పిడి వంటి ఇబ్బందులను కూడా ఇది తొలగిస్తోంది.
ఒకే చోట అన్ని అనుమతులు..
గిఫ్ట్ సిటీ ప్రత్యేకత ఏమిటంటే.. ఇక్కడ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ , స్టాక్ మార్కెట్ వంటి అన్ని విభాగాలకు IFSCA అనే ఒకే ఒక సంస్థ నిబంధనలను పర్యవేక్షిస్తుంది. దీనివల్ల పెట్టుబడిదారులు వేర్వేరు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పనులు వేగంగా పూర్తవుతాయి. ఇది సింగపూర్, దుబాయ్ వంటి అంతర్జాతీయ నగరాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది.
ఎన్ఆర్ఐలకు సులభమైన మార్గం..
భారతదేశ చట్టాల ప్రకారం గిఫ్ట్ సిటీని ఒక ‘విదేశీ భూభాగం’గా పరిగణిస్తారు. దీనివల్ల ఎన్ఆర్ఐలు తమ వద్ద ఉన్న డాలర్లు లేదా యూరోలను రూపాయిల్లోకి మార్చకుండానే నేరుగా పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే తమకు వచ్చిన లాభాలను తిరిగి విదేశాలకు తీసుకెళ్లడం కూడా చాలా సులభం. భారత్కు రాకుండానే వీడియో కేవైసీ (Video KYC) ద్వారా ఖాతాలు తెరిచే సదుపాయం కూడా ఉంది. పన్నుల విషయంలో కూడా ప్రభుత్వం ఎన్నో రాయితీలు కల్పించింది.
సాధారణంగా విదేశాల్లో పెట్టుబడి పెట్టాలంటే చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. గిఫ్ట్ సిటీ ద్వారా గ్లోబల్ స్టాక్స్ , ఇతర ఆస్తులలో పెట్టుబడి పెట్టడం ఇప్పుడు మన దేశంలో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టినంత సులభంగా మారుతోంది. ఇది క్రమంగా పెట్టుబడిదారుల అలవాట్లను మారుస్తూ.. అంతర్జాతీయ మార్కెట్ను మనకు దగ్గర చేస్తోంది.
వేగంగా విస్తరిస్తున్న ఆర్థిక హబ్..
సెప్టెంబర్ 2025 నాటికి ఉన్న లెక్కల ప్రకారం.. గిఫ్ట్ సిటీలోని బ్యాంకింగ్ ఆస్తుల విలువ 100 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఇప్పటికే ఇక్కడ 1,000 కంటే ఎక్కువ సంస్థలు తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయి .. 20,000 మందికి పైగా నిపుణులు ఇక్కడ పని చేస్తున్నారు. ఇది ప్రపంచ స్థాయి ఆర్థిక కేంద్రంగా ఎంత వేగంగా ఎదుగుతుందో ఈ గణాంకాలే చెబుతున్నాయి.
గిఫ్ట్ సిటీ ఇంకా ఎదుగుతున్న దశలోనే ఉన్నప్పటికీ, ప్రభుత్వం అందిస్తున్న మద్దతు, నిబంధనలలో ఉన్న స్పష్టత పెట్టుబడిదారులకు నమ్మకాన్ని ఇస్తోంది. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ చేరితే, భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించడం ఖాయం.