EV Market: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(EV) జోరు మీదు ఉంది. ఈవీ మార్కెట్ రాబోయే కొన్ని సంవత్సరాల్లో మరింత పుంజుకుంటుందని ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్IESA) నివేదిక వెల్లడించింది. ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారుల్ని ప్రోత్సహించడం, కొన్ని రాయితీలు ప్రకటించడంతో పాటు దేశవ్యాప్తంగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు వేగంగా విస్తరించడంతో చాలా మంది ఈవీల వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. 2032 నాటికి దేశంలో ఏటా 3.04 కోట్ల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. అంతేకాకుండా, కార్ల అమ్మకాలు దాదాపు 12 రెట్లు పెరగవచ్చు. ఈ నివేదికను కస్టమైజ్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ (CES) వారు తయారుచేశారు.
ఏకంగా 26 శాతం పెరిగిన అమ్మకాలు:
నివేదిక ప్రకారం, భారత్లో ఈవీల అమ్మకాలు 2024లో 20 లక్షల యూనిట్ల నుంచి 2025 నాటికి 26 లక్షల యూనిట్లకు పెరిగాయి. ఒక్క ఏడాదిలో 26 శాతం వృద్ధి నమోదైంది. వాహన అమ్మకాలలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 2024లో 8.1 శాతం ఉండగా, 2025లో అది 9.5 శాతానికి పెరిగింది. ఇది భారతీయ వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా మళ్లుతున్నట్లు సూచిస్తోంది.
2025లో మొత్తం ఈవీ అమ్మకాలలో 60.1 శాతం వాటాతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. ఎలక్ట్రిక్ త్రీవీలర్ వాహనాలు 31.6 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ రెండు విభాగాలు కలిసి దేశంలోని మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో 91 శాతానికి పైగా వాటాను అందించాయి. ప్రస్తుతం దేశంలో ఈవీ బూమ్కు ఈ రెండు సెగ్మెంట్లే కీలకంగా ఉన్నాయి. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల వాటా 7.7 శాతానికి పెరిగింది. ఇది బ్యాటరీలతో నడిచే కార్లను వేగంగా స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ బస్సుల వాటా 0.2 శాతం, ఎలక్ట్రిక్ టక్కుల వాటా 0.4 శాతంగా ఉంది.
పెరుగుతున్న బ్యాటరీ డిమాండ్:
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడంతో బ్యాటరీ డిమాండ్ వేగంగా పెరుతుందని నివేదిక వెల్లడించింది. 2025 మొత్తం బ్యాటరీ డిమాండ్ 19 GWh ఉండగా, 2032 నాటికి అది 362 GWhకు చేరుకోవచ్చు. ఈవీల సంఖ్య, భారీ బ్యాటరీ ప్యాక్ వాడకమే ఇందుకు కారణం. 2025 బ్యాటరీ డిమాండ్లో ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలు మొత్తం బ్యాటరీ డిమాండ్లో 40 శాతం వాటా కలిగి ఉండగా, త్రీ-వీలర్లు 27 శాతం, టూ-వీలర్లు 23 శాతం వాటా కలిగి ఉన్నాయి.
ప్రస్తుతం ఈవీ విడిభాగాల మార్కెట్లో బ్యాటరీ ప్యాక్లు 52 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉండగా, మోటార్లు 22 శాతం, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ 11 శాతం, DC-DC కన్వర్టర్లు 3 శాతం వాటా కలిగి ఉన్నాయి. స్థానిక తయారీ, సప్లై చైన్లో విడిభాగాల స్ధానికీకరణ ఈ మార్కెట్కు సవాల్ విసురుతోంది. వీటిని పరిష్కరిస్తే ఇండియాలో ఈవీ మార్కెట్ మరింత వృద్ధి చెందగలదు.

