ఉద్యోగాల విషయంలో ప్రతిపక్షాలు విమర్శలు పెంచాయి.. దీంతో.. అదే స్థాయిలో ఎదురుదాడికి దిగుతోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ… ఇవాళ మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి… విపక్షాల కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. చంద్రబాబు హయాంలో కేవలం 8 వేల మందికే ఉద్యోగాలిచ్చారన్న ఆయన.. వైసీపీ ప్రభుత్వం 1.84 లక్షల ఉద్యోగాలిచ్చిందని.. గ్రామ సచివాలయాల్లోనే 1.30 లక్షల మందికి ఉద్యోగాలిచ్చామని.. ఇవి కాకుండా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించామని తెలిపారు.. ప్రభుత్వ ఉద్యోగాలకు కాలం చెల్లిందని మనసులో మాట పుస్తకంలో చంద్రబాబే చెప్పారని గుర్తుచేసిన ఆయన.. ఉద్యోగులకు భద్రత కల్పిస్తే సోమరిపోతులు అవుతారని చులకనగా చూసిన చరిత్ర చంద్రబాబుది అంటూ మండిపడ్డారు.
వచ్చే ఏడాది జాబ్ క్యాలెండర్లో ఎక్కువ ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు ఎమ్మెల్యే కాకాని.. చంద్రబాబు ఉచ్చులో వామపక్షాలు పడ్డాయని ఎద్దేవా చేసిన ఆయన.. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న చంద్రబాబుని గతంలో ఎందుకు నిలదీయ లేకపోయారు..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, నారా లోకేష్ అమెరికాకు వెళ్లి చదువుకోలేక వచ్చేశాడని సెటైర్లు వేసిన ఆయన.. చదువు సంధ్యా లేని లోకేష్.. ఉద్యోగాల గురించి మాట్లాడ్డం విడ్డూరంగా ఉందన్నారు. చదువుకుంటామని అమెరికా వెళ్లిన లోకేష్ అక్కడికి వెళ్లి ఏదేదో చేశారని విమర్శించిన కాకాని.. తన హయాంలో చంద్రబాబు ధాన్యం కొనుగోళ్లల్లో పూర్తిగా విఫలమయ్యారని.. అలాంటి చంద్రబాబు.. వైసీపీని విమర్శిస్తారా..? అంటూ దుయ్యబట్టారు.