NTV Telugu Site icon

YSRCP Leaders: పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు బలిపశువు చేస్తున్నారు

Ysrcp Leaders

Ysrcp Leaders

YSRCP Leaders: అమరావతిలోని తాడేపల్లిలో వైసీపీ కాపు, రెడ్డి, కమ్మ కార్పొరేషన్‌ల ఛైర్మన్లు శుక్రవారం మధ్యాహ్నం కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కులాల ఛైర్మన్‌లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ఇంటిపై రెక్కీ తన ఆధ్వర్యంలోనే జరిగిందని ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నానని రెడ్డి కార్పొరేషన్ ఛైర్మన్ సత్యనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. తన కారు పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని.. అయితే తన కారు కాదని స్పష్టం చేశారు. అది గుజరాత్ రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న కారు అన్నారు. రెడ్డి, కాపు సామాజిక వర్గాలను విడగొట్టాలని చూస్తున్నారని.. రెక్కీ నిర్వహించిన వారు చంద్రబాబు, లోకేష్‌తో ఫోటోలు దిగారని తెలిపారు. విశాఖలో జనసేన కార్యకర్తలు మంత్రులపై దాడులు చేశారని గుర్తుచేశారు.

Read Also: Kantara Star Rishabh Shetty: ‘కాంతార’ స్టార్‌ను కలిసిన మిస్టర్‌ 360

అటు ఏపీలో కాపు సామాజిక వర్గంపై కుట్ర జరుగుతోందని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర రెక్కీ చేసిన వారు కమ్మ సామాజికవర్గం వారే అని అన్నారు. పవన్ కళ్యాణ్‌పై ఎవరు కుట్ర చేస్తున్నారో జన సైనికులు తెలుసుకోవాలని సూచించారు. పవన్ కళ్యాణ్‌పై రెక్కీ చేయాల్సిన అవసరం ఎవరికీ లేదని.. గత ఎన్నికల సమయంలో టీడీపీ వాళ్ళు కుట్ర చేశారని పవన్ కళ్యాణ్ ఆరోపించినట్లు గుర్తుచేశారు. కేఏ పాల్ కూడా తనపై కుట్ర చేస్తున్నారని అన్నారని చెప్పారు. రెడ్లు, కాపుల మధ్య విభేదాలు సృష్టిస్తే ఎవరికి లాభమో తెలుసుకోవాలన్నారు. కాపు సంఘాలు, పెద్దలు ఈ శక్తులను బయటకు తీయాలన్నారు. ఈ విషయంపై డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కులాల మధ్య కుంపట్లు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని.. పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు బలిపశువు చేస్తున్నారని కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ ఆరోపించారు. చంద్రబాబు తన వయసుకు తగ్గట్లు వ్యవహరిస్తే హుందాగా ఉంటుందని హితవు పలికారు.