వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. శుక్రవారం రఘునాధ్రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో మొదటిసారిగా రఘునాధ్రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఇతను సీఎం క్యాంపు కార్యాలయ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. వైసీపీ రాష్ట్రకార్యదర్శి శివశంకర్రెడ్డిని 7 గంటల పాటు సీబీఐ విచారించింది. గతంలో కూడా శివశంకర్రెడ్డిని సిట్, సీబీఐ బృందాలు ప్రశ్నించాయి. ఈ కేసులో కీలక సమాచారాన్ని సీబీఐ అధికారులు సేకరించారు. మరోవైపు డాక్టర్ భరత్ రెడ్డిని కూడ సీబీఐ అధికారులు విచారించారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలతో పాటు కీలకమైన డాక్యుమెంట్లను సీజ్ చేశారు. మరోవైపు శివశంకర్రెడ్డికి అత్యంత సన్నిహితుడైన మణికంఠరెడ్డిపై వివేకా కుమారై సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Also : యంగ్ హీరో నిఖిల్ కు కమిషనర్ ప్రశంసలు
ఈ నెల 10న ఓ అనుమానితుడు తమ ఇంటిచుట్టూ రెండుసార్లు తిరిగాడని, ఇంటి కాంపౌండ్ తరువాతి డోర్ దగ్గర ఆగి ఫోన్ కాల్స్చేశాడని కంప్లైంట్ చేశారు. తన తండ్రి హత్యకేసులో శివశంకర్రెడ్డి కీలకమైన అనుమానితుడని, ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని శివశంకర్రెడ్డి పాత్రను నిగ్గుతేల్చాలని సునీత కోరారు. 2019 మార్చి 14వ తేదీ రాత్రి తన ఇంట్లోనే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యాడు. ఈ హత్యపై వివేకానందరెడ్డి కూతురు సునీతా రెడ్డి పలువురి అనుమానితుల పేర్లను కూడ సీబీఐకి అందించింది. రెండేళ్లుగా ఈ కేసులో నిందితులను గుర్తించకపోవడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని సీబీఐ ఉన్నతాధికారులకు ఆమె వినతిపత్రం సమర్పించారు.ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తులో వేగం పెరిగింది. 68 రోజులుగా సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు.