Harsha Kumar: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించిన విషయం విదితమే.. వర్గీకరణ జరిపి షెడ్యూల్డ్ కులాల్లో సామాజికంగా, ఆర్థికంగా మరింత వెనుకబడి ఉన్న కులాలకు ప్రత్యేక కోటా ఇచ్చేందుకు రాష్ట్రాలకు రాజ్యాంగపరమైన అధికారం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.. ఈ మేరకు ఆగస్టు 1వ తేదీన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై∙చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 6:1 మెజార్టీతో తీర్పు వెలువరించింది.. అయితే.. ఎస్సీల్లోని కొన్ని వర్గాలు ఈ పరిణామాలను స్వాగతిస్తూ సంబరాలు చేసుకుంటుండగా.. మరోవైపు.. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగ సవరణ లేకుండా వర్గీకరణ ఎలా చేస్తారని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్.. కేంద్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు.
ఇక, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూడా ఫైర్ అయ్యారు హర్షకుమార్.. భవిష్యత్ కార్యాచరణపై రేపు మధ్యాహ్నం విజయవాడలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వైఎస్ జగన్ పై వ్యతిరేకత కారణంగానే చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యారన్న ఆయన.. పోలవరం ప్రాజెక్టుకే దిక్కు లేకపోతే నదుల అనుసంధానం అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.. మరోవైపు.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జగన్ పేరు ఇష్టం లేకపోతే పగటి సమయంలోనే తీసివెయ్యాల్సిందని సూచించారు.. ఇక, విశాఖ పోర్టులో పట్టుబడిన 50 వేల కోట్ల డ్రగ్స్ కేసులో దర్యాప్తు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్.