Deputy CM Pawan Kalyan: ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని వికసిత్ భారత్ దిశగా ముందుకు నడిపిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యా్ణ్ అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ, మోడీ దేశం కోసం చేస్తున్న కృషి కొత్త తరానికి పూర్తిగా తెలియాల్సిన అవసరం ఉందన్నారు. జంతర్మంతర్లో ప్రధానిని అనుచిత పదజాలంతో విమర్శించిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పవన్ తెలిపారు. ప్రధాని మోడీపై ఎవరైనా విమర్శలు చేస్తే, అది తమందరిపైనా చేసినట్లేనని వ్యాఖ్యానించారు. నేటి యువతకు దేశ నాయకుల పట్ల గౌరవం, సరైన సంస్కారం నేర్పాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
దేశానికి సేవ చేయడంలో ప్రధాని మోడీ ఎలాంటి సెలవులు తీసుకోకుండా నిరంతరం శ్రమిస్తున్న మహానేత అని పవన్ కల్యాణ్ కొనియాడారు. దేశాన్ని నడిపించడం రామకార్యంలాంటిదని, అలాంటి గొప్ప బాధ్యతను మోడీ సమర్థంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. దేశం కోసం అంకితభావంతో పనిచేస్తున్న నాయకుడికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఇక, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్న పవన్, ఒకప్పుడు “ఎర్రబస్సు కూడా రాదు” అని విమర్శించిన ప్రాంతంలో నేడు అంతర్జాతీయ విమానాశ్రయం రావడం అభివృద్ధికి నిదర్శనమన్నారు. ప్రధాని మోడీని మించిన నాయకుడు మరొకరు లేరని, భవిష్యత్తులో కూడా అలాంటి నాయకత్వం అరుదేనని వ్యాఖ్యానించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..

