Botsa Satyanarayana: జగన్ పర్యటనను విజయవంతం చేశాం.. కూటమి ప్రభుత్వంపై బొత్స తీవ్ర ఆరోపణలు

Botsa Satyanarayana

Botsa Satyanarayana

Botsa Satyanarayana: మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన పర్యటన విజయవంతమైందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఎయిర్‌పోర్టు నుంచి అంపోలు వరకు లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా జగన్‌కు స్వాగతం పలికారని చెప్పారు. పోలీసులు అనేక ఆంక్షలు విధించినప్పటికీ కార్యకర్తలు, ప్రజలు పూర్తిగా శాంతియుతంగా వ్యవహరించారని పేర్కొన్నారు. అయితే, జగన్ పర్యటనపై కొన్ని పత్రికలు వాస్తవాలను వక్రీకరించి కథనాలు ప్రచురించాయని బొత్స ఆరోపించారు. జరిగిన సంఘటనలను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేయడం బాధాకరమని, ప్రజలు చూసిన వాస్తవాలను మార్చి చూపించడం సరికాదని అన్నారు.

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై అక్రమంగా కేసులు నమోదు చేసి జైలుకు పంపారని బొత్స ఆరోపించారు. ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి పోలీసు శాఖతో రాజకీయ ప్రత్యర్థులపై నేరపూరిత కేసులు నమోదు చేయిస్తోందని విమర్శించారు. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. పోలీసుల వ్యవహారశైలిపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కారు వెళ్లేందుకు కూడా పోలీసులు అనుమతించలేదని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. తనకు జరిగిన అవమానం, పోలీసుల ప్రవర్తనపై గవర్నర్‌కు లేఖ రాసి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ప్రభుత్వం పోలీసు శాఖను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తోందని ఆరోపించారు.

కూటమి ప్రభుత్వ మంత్రులు, ముఖ్యంగా హోం మంత్రి చేస్తున్న వ్యాఖ్యలను కూడా బొత్స తప్పుబట్టారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో వ్యవహరించడం సరికాదని, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఎవరినీ బెదిరించలేదని, తనను కూడా ఎవరూ బెదిరించలేదని అన్నారు. “మీకు వ్యక్తిత్వం లేకపోతే మాకు ఉంది” అంటూ ప్రభుత్వ తీరును విమర్శించారు. శ్రీకాకుళం పర్యటనను విజయవంతం చేసిన మూడు జిల్లాల పార్టీ శ్రేణులకు బొత్స కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగించి, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు ప్రజాస్వామ్య పద్ధతుల్లో బుద్ధి చెప్పాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అంశంపైనా బొత్స స్పందించారు. ఈ ప్రాజెక్టుకు పునాది స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పడిందని, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనులు ముందుకు సాగాయని చెప్పారు. వైఎస్సార్, జగన్ ఇద్దరి మంత్రివర్గాల్లో పనిచేసిన వ్యక్తిగా తాను ఈ విషయాన్ని చెబుతున్నానని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు గురించి కొత్తగా మాట్లాడుతున్న వారు చరిత్రను తెలుసుకోవాలని, భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఆలోచన చంద్రబాబు నాయుడిదని చెప్పడం వాస్తవాలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు బొత్స సత్యనారాయణ..