విశాఖ ప్రజలకు శుభవార్త అందింది. విశాఖ మహానగరానికి త్వరలో మెట్రోరైలు రానుంది. ఈ మేరకు 76 కిలోమీటర్ల పరిధిలో మెట్రో రైల్ వ్యవస్థను నిర్మించాలని నిర్ణయించినట్లు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ యూజేఎం రావు వెల్లడించారు. విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టుపై శనివారం నాడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు ఐదేళ్లలో పూర్తవుతుందని తెలిపారు. మొత్తం 54 మెట్రో స్టేషన్లు, రెండు డిపోలు నిర్మిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మెట్రో రైలు ప్రాజెక్టు ఏర్పాటుకు హై పవర్ కమిటీ ఏర్పాటు చేసినట్టు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ యూజేఎం రావు వివరించారు. హై పవర్ కమిటీ ఆధ్వర్యంలో రూ.14,309 కోట్ల వ్యయంతో మెట్రో రైలు ప్రాజెక్టు అంచనాలు రూపొందించినట్టు వెల్లడించారు. మెట్రో రైలు ప్రాజెక్టు నేపథ్యంలో స్థానికుల స్థలాలకు, భవనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు యూజేఎం రావు స్పష్టం చేశారు. విశాఖలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ కారణంగా రోడ్లపై ప్రయాణం చేయాలంటే ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు రాకతో ప్రయాణికులు, చిరు ఉద్యోగుల కష్టాలు మరో ఐదేళ్లలో తీరనున్నాయి.
Special Trains : సికింద్రాబాద్ నుంచి తిరుపతికి స్పెషల్ ట్రైన్.. ఎప్పుడంటే..?