YS Jagan: సాయికృష్ణ కుటుంబాన్ని ఓదార్చిన జగన్.. కృష్ణలంక ఘటనలపై సీరియస్‌.. సీబీఐ విచారణకు డిమాండ్‌..

Ys Jagan Meets Sai Krishna'

Ys Jagan Meets Sai Krishna'

YS Jagan: సాయికృష్ణ అదృశ్యం, మరణ ఘటనల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా సాయికృష్ణ తల్లి, కుటుంబ సభ్యుల నుంచి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబం చేస్తున్న న్యాయ పోరాటానికి వైసీపీ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, విజయవాడ నడిబొడ్డున ముఖ్యమంత్రి నివాసం, డీజీపీ కార్యాలయం, పోలీసు కమిషనరేట్ వంటి కీలక వ్యవస్థలు ఉన్న ప్రాంతంలోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళనకరమని అన్నారు. సాయికృష్ణ తల్లి తన కుమారుడికి న్యాయం చేయాలని కోరుతూ పడుతున్న వేదన ప్రతి ఒక్కరినీ కలచివేస్తోందని పేర్కొన్నారు.

సాయికృష్ణ ఘటన ఒక్కటే కాదని, అదే పోలీస్ స్టేషన్ పరిధిలో క్రాంతి కుమార్ ఆత్మహత్య వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చిందని జగన్ అన్నారు. క్రాంతి కుమార్ తన మరణానికి ముందు విడుదల చేసినట్లు ప్రచారంలో ఉన్న వీడియోలో పోలీసుల వేధింపుల గురించి ప్రస్తావించాడని పేర్కొన్నారు. సాయికృష్ణ అదృశ్యమైన మే 9వ తేదీ నుంచి అతని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం ప్రయత్నిస్తున్నారని జగన్ చెప్పారు. కుటుంబ సభ్యులు, న్యాయవాదులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. హైకోర్టును ఆశ్రయించిన తర్వాతే ఈ వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుందని పేర్కొన్నారు.

×
×
Ad

సంబంధిత సీఐపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారని గుర్తు చేసిన జగన్, కేవలం సస్పెన్షన్‌తో సరిపెట్టడం సరైన చర్య కాదని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఆరోపణలు నిజమైతే, ఘటనలో బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. ఈ కేసులో సీఐతో పాటు ఇతర ఉన్నతాధికారుల పాత్రపైనా అనుమానాలు ఉన్నాయని జగన్ ఆరోపించారు. పోలీసులపై పోలీసులే విచారణ జరపడం వల్ల పూర్తి నిజాలు వెలుగులోకి రావని, స్వతంత్ర సంస్థతో విచారణ అవసరమని పేర్కొన్నారు. అందుకే ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలని జగన్ డిమాండ్ చేశారు. సీఐ నుంచి ఉన్నతాధికారుల వరకు ఎవరి పాత్ర ఏమిటి, ఘటనలు ఎలా జరిగాయి, బాధ్యులు ఎవరు అనే విషయాలు సమగ్రంగా బయటపడాలంటే సీబీఐ విచారణ ఒక్కటే మార్గమని అన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైసీపీ అండగా ఉంటుందని జగన్ మరోసారి స్పష్టం చేశారు. ఈ కేసులో వాస్తవాలు వెలుగులోకి వచ్చి బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.