AP Liquor Case: ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. లిక్కర్ కేసులో నిందితులు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, పైలా దిలీప్ లకు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ ఆదేశాలు రద్దు చేయాలని సిట్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసింది. నిందితుల తరపున వాదనలు నిరంజన్ రెడ్డి వినిపించగా సిట్ తరపున వాదనలు సిద్ధార్ధ లూథ్రా వినిపించారు. సిద్ధార్ధ లుథ్రా వాదనలలో భాగంగా నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ ఉత్తర్వులు చట్ట విరుద్దమని అన్నారు. ఆగస్టు 11న సిట్ అదనపు చార్జి షీట్ దాఖలు చేసిందని అందులో ఈ నలుగురు నిందితుల పాత్ర గురించి వివరించినట్టు చెప్పారు. ఆగస్టు 18న ఏ33 బాలాజీ గోవిందప్ప రెగ్యులర్ బెయిల్ ఏసిబి కోర్టు డిస్మిస్ చేసిందనీ 23న చార్జి షీట్ పై అభ్యంతరాలు వ్యక్తం చేసిందని తెలిపారు.
Read Also: Ladakh Violence: లడఖ్ హింసపై కేంద్రం ప్రత్యేక దృష్టి.. కీలక సమాచారం సేకరణ!
ఇక, సెప్టెంబర్ ఒకటో తేదీలోపు అభ్యంతరాలు నివృత్తి చేశామన్నారు వాటిని పరిగణలోకి తీసుకోకుండా డిఫాల్ట్ బెయిల్ ఇచ్చారన్నారు.. 18న రెగ్యులర్ బెయిల్ డిస్మిస్ చేసి సెప్టెంబర్ 5న డిఫాల్ట్ బెయిల్ ఎలా మంజూరు చేస్తారన్నారు. నలుగురు బెయిల్ ఉత్తర్వులు రద్దు చేయలని కోరారు. మరోవైపు, నిందితుల తరపున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ రెగ్యులర్ బెయిల్ పై ఆదేశాలకు డిఫాల్ట్ బెయిల్ పై ఆదేశాలకు సంబంధం లేదన్నారు. రెగ్యులర్ బెయిల్ పై ఆదేశాలు అప్పటి పరిస్థితి ఆధారాల బట్టి ఉంటుందని.. తర్వాత ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ మంజూరు ఉత్తర్వులపై గతంలో ఇచ్చిన ఆదేశాలు ప్రభావం చూపవన్నారు. 90 రోజుల తర్వాత డిఫాల్ట్ బెయిల్ ఇవ్వటానికి చట్టంలో అవకాశం ఉందన్నారు. ఇరు వర్గాల వాదనలు ముగియంతో లిఖిత పూర్వక వాదనలు శుక్రవారంలోపు సమర్పించాలని హైకోర్టు విచారణ వాయిదా వేసింది.