CM Chandrababu: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతోంది.. అయితే, దసరా మహోత్సవాలకు హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆహ్వానించారు దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అధికారులు, అర్చకులు.. క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన అధికారులు, అర్చకులు.. ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎం చంద్రబాబును ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో దుర్గ గుడి ఈవో శీనా నాయక్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, అర్చకులు పాల్గొన్నారు.
Read Also: Asia Cup 2025: భారత్తో మ్యాచ్కు ముందే.. పాకిస్తాన్ బౌలర్ రిటైర్మెంట్!
కాగా, బెజవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఫోకస్ పెట్టింది. దసరా మహోత్సవాల ప్రణాళికలు, భక్తుల రద్దీ నిర్వహణ, క్యూ లైన్లు, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్, త్రాగునీరు, వైద్య సహాయం, శానిటేషన్ వంటి అంశాలపై ఇప్పటికే మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్షించారు. అన్ని విభాగాలు పరస్పరం సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. అమ్మలగన్నయమ్మ.. ఆమహాశక్తి.. విజయవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను వేగవంతం చేశారు అధికారులు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. మహోత్సవాల కోసం చేపడుతున్న ఏర్పాట్లు, భక్తుల రద్దీకి అనుగుణంగా వేసిన ప్రణాళికలపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి దిశానిదేశం చేశారు. సెప్టెంబర్ 22 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ ఏడాది పదకొండు రోజుల పాటు, అమ్మవారు పదకొండు రకాల శోభాయమాన అలంకారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. లక్షలాదిగా భక్తులు ఈ ఉత్సవాలకు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు.
