Vijayawada Robbery: బెజవాడలో దోపిడీ చేసిన ఘటన కలకలం రేపుతుంది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సోదరుడు రాజేంద్ర నిర్వహిస్తున్న గ్యాస్ ఏజెన్సీలో తుపాకీతో బెదిరించి డబ్బు దోచుకెళ్లిన ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. అయితే, ఏజెన్సీలో డెలివరీ బాయ్స్గా పని చేస్తున్న ధీరజ్, భజరంగ్, దినేష్ అనే ముగ్గురు యువకులు ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇక, నిందితులు రాజస్థాన్కు చెందిన వారు కాగా, గ్యాస్ డెలివరీ సమయంలో కేవలం హిందీ మాత్రమే మాట్లాడటంతో కస్టమర్లతో, సిబ్బందితో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో యాజమాన్యం వారిని ఉద్యోగాల నుంచి తొలగించింది.
Read Also: Ragi Java Recipe: బ్రేక్ఫాస్ట్ తయారీకి సమయం లేదా? శక్తినిచ్చే రాగి జావ 10 నిమిషాల్లో రెడీ..
ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం డ్యూటీ యూనిఫామ్ అప్పగిస్తామని గ్యాస్ ఏజెన్సీకి వచ్చిన నిందితులు, షట్టర్ మూసివేసి లోపల ఉన్న ఉద్యోగికి తుపాకీ చూపించి కౌంటర్లో ఉన్న సుమారు లక్ష రూపాయల నగదును తీసుకుని నిందితులు పరారయ్యారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే, నిందితులు ఉపయోగించినది అసలైన తుపాకీనా, లేక బొమ్మ తుపాకీనా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
