కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి జన ఆశీర్వాద యాత్రకు సిద్ధం అవుతున్నారు.. యాత్ర ఏర్పాట్లపై భారతీయ జనతా పార్టీ నేతలు సమావేశం నిర్వహించారు… ఈ యాత్రకు స్వాగత కార్యక్రమాలు, చిన్న చిన్న సభలు, బైక్ ర్యాలీలు, కార్యకర్తల సమ్మేళనాలు.. నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు… తన యాత్రలో భాగంగా వనజీవి రామయ్య, చింతకింది మల్లేశంలను కలవనున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఇక, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కిషన్రెడ్డి టూర్కు సంబంధించిన షెడ్యూల్ను పరిశీలిస్తే.. తిరుమల శ్రీవారిని, బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న తర్వాత.. తెలంగాణలోని కోదాడ నుంచి ఆయన యాత్ర ప్రారంభం కానుంది.
ఈ నెల 15వ తేదీ రాత్రి తిరుమలకు చేరుకోనున్నారు కిషన్రెడ్డి.. 16న ఉదయం శ్రీవారి దర్శనం.. మధ్యాహ్నం 4.30 గంటలకు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అమ్మ వారి దర్శనం చేసుకుంటారు.. ఆ తర్వాత సాయంత్రం 6.30 గంటలకు కోదాడ నుండి యాత్ర ప్రారంభం అవుతుంది.. రాత్రి 8 గంటలకు ఖమ్మం చేరుకుని రాత్రి అక్కడే బస చేయనున్నారు.. 17న ఉదయం 10 గంటలకు మహబూబాబాద్, మధ్యాహ్నం 12 గంటలకు నర్సంపేట, 3 గంటలకు ములుగు, 4 గంటలకు రామప్పలో పర్యటించనున్నారు.. ఇక, అదేరోజు రాత్రికి వరంగల్ భద్రకాళి దర్శనం చేసుకుని వరంగల్లోనే బస చేస్తారు.. మరునాడు 18న ఉదయం 9 గంటలకు జనగామ చేరుకోనున్న ఆయన.. ఉదయం 10.45కి యాదగిరి గుట్ట, మధ్యాహ్నం 12.30 భువనగిరి, 2 గంటలకు ఘట్కేసర్, సాయంత్రం 4.30 గంటలకు ఉప్పల్, రాత్రి 8 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు.. 19, 20 తేదీల్లో సికింద్రాబాద్ నియోజక వర్గంలో కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర సాగనుంది. తాజాగా జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణలో ప్రధాని నరేంద్ర మోడీ కీలకమైన మూడు శాఖల బాధ్యతలను కిషన్రెడ్డికి అప్పగించిన సంగతి తెలిసిందే.. గత కేబినెట్లో సహాయ మంత్రిగా ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు ఏకంగా మూడు శాఖలు చూస్తున్నారు కిషన్రెడ్డి.