సొంతిల్లు కట్టుకోవాలనే నిరుపేదల కలను నిజం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పండుగ ముందే అదిరిపోయే శుభవార్తను అందించింది. తిరుపతి జిల్లా నాయుడుపేట సమీపంలోని బిరదవాడ వద్ద నిర్మించిన 2,064 టిడ్కో (TIDCO) ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలుగు కొత్త సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని, మార్చి 17న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ భారీ గృహ సముదాయాన్ని అధికారికంగా ప్రారంభించి, నిరుపేదలకు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం అందించే ఈ కానుకతో వందలాది కుటుంబాల్లో పండుగ వెలుగులు ముందే రానున్నాయి.
ఈ ప్రాజెక్టు చరిత్రను పరిశీలిస్తే, గత టీడీపీ హయాంలోనే నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలోని 36 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఈ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అప్పట్లోనే సుమారు 70 శాతం పనులు పూర్తయినప్పటికీ, తదనంతరం జరిగిన రాజకీయ పరిణామాలు , ప్రభుత్వం మారడంతో ఈ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. అయితే, ఇటీవల మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిచిపోయిన టిడ్కో ఇళ్లపై ప్రత్యేక దృష్టి సారించింది. సుమారు రూ. 168 కోట్ల వ్యయంతో, నేషనల్ హైవే 16 పక్కన నిర్మించిన ఈ ఇళ్లలో పెండింగ్లో ఉన్న అన్ని పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించి, సకల మౌలిక వసతులతో వీటిని సుందరంగా తీర్చిదిద్దింది.
ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఉగాది నాటికి గృహ ప్రవేశాలు చేయించాలనే లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం, ఈ నెల 17నే ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. సకల సదుపాయాలతో కూడిన ఈ ఇళ్లు అందుబాటులోకి రావడంతో లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న క్రమంలో, ఈ టిడ్కో ఇళ్ల పంపిణీని ప్రభుత్వం ఒక మైలురాయిగా భావిస్తోంది. ఉగాది పండుగకు ముందే నిరుపేదలు తమ సొంతింటి గడప తొక్కబోతుండటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.