NTV Telugu Site icon

Tirumala: శ్రీవారి ఆర్జిత సేవలపై టీటీడీ కీలక నిర్ణయం

కరోనా మహమ్మారి విజృంభణ ప్రభావం శ్రీవారి దర్శనాలపైనే కాదు.. ఆర్జిత సేవలు సహా వివిధ సేవా కార్యక్రమాలపై కూడా పడింది.. అయితే, క్రమంగా కరోనా కేసులు తగ్గి.. మళ్లీ సాధారణ పరిస్థితులు వస్తుండడంతో కీలక నిర్ణయం తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం.. శ్రీ‌వారి ఆల‌యంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్జిత సేవ‌లు తిరిగి ప్రారంభించనుంది.. ఆర్జిత సేవలకు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి భ‌క్తుల‌ను అనుమ‌తించాల‌ని టీటీడీ నిర్ణయించింది. సుప్రభాతం, తోమాల‌, అర్చన‌, అష్టద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌, తిరుప్పావ‌డ‌, మేల్‌చాట్ వ‌స్త్రం, అభిషేకం, క‌ల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, స‌హ‌స్రదీపాలంకార సేవ‌లు నిర్వహించనున్నట్టు టీటీడీ వెల్లడించింది. గతంలోనే ఉన్న విధానంలోనే ఆర్జిత సేవా టికెట్ల బుక్‌చేసుకోవాలని టీటీడీ తెలిపింది.

మరోవైపు క‌ల్యాణోత్సవం, ఊంజ‌ల్ సేవ‌, ఆర్జిత బ్రహ్మోత్సవం, స‌హ‌స్రదీపాలంకార సేవలకు సంబంధించి భ‌క్తులు నేరుగా పాల్గొనే విధానంతోపాటు వ‌ర్చువ‌ల్ విధానం కూడా కొనసాగుతోందని స్పష్టం చేసింది టీటీడీ.. వ‌ర్చువ‌ల్ సేవ‌ల‌ను బుక్ చేసుకున్న భ‌క్తులు ఆయా సేవ‌ల్లో నేరుగా పాల్గొనే అవ‌కాశం లేదని పేర్కొంది.. అయితే, వారికి శ్రీవారి ద‌ర్శనంతో పాటు ప్రసాదాలు అందిస్తామని తెలిపింది.. ఇక, అడ్వాన్స్ బుకింగ్‌లో ఆర్జిత సేవ‌లను బుక్ చేసుకున్న వారిని, ఉద‌యాస్తమాన సేవ, వింశ‌తి వ‌ర్ష ద‌ర్శిని సేవ‌లు బుక్ చేసుకున్న వారిని ఏప్రిల్ 1వ తేదీ నుండి కోవిడ్‌-19 నిబంధ‌న‌లు పాటిస్తూ ఆయా సేవ‌ల‌కు అనుమతించనున్నట్టు పేర్కొంది టీటీడీ.