రాష్ట్ర విభజన సరిగా సాగకపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొన్ని శాఖల మధ్య వివాదాలు రాజుకుంటూనే వున్నాయి. తాజాగా విద్యుత్ రంగంలో జీపీఎఫ్ వివాదం తెరమీదకు వచ్చింది. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము వెనక్కి ఇవ్వాలని ఏపీ విద్యుత్ సంస్థలకు లేఖ రాశారు తెలంగాణ ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు.
1999 నుంచి 2014 వరకు తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు దాచుకున్న సొమ్ము రూ. 2900 కోట్లు వుందన్నారు. ఇటీవల ఏపీలోని నాన్బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లలో ఉన్న నిధులు, డిపాజిట్లను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లో జమ చేయాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. జీపీఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్ సొమ్ముపై తెలంగాణ ట్రాన్స్ కో, జెన్కో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
ఉద్యోగులు, పెన్షనర్లకు న్యాయంగా ఇవ్వాల్సిన సొమ్మును వెంటనే ట్రాన్స్ ఫర్ చేయాలని లేఖలో కోరారు సీఎండీ ప్రభాకర్ రావు, మరోవైపు తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ జేఏసీ తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము ట్రాన్స్ ఫర్ చేయకుంటే ఏపీ విద్యుత్ పెన్షనర్లకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది.
