NTV Telugu Site icon

Global Investors’ Summit: హై సెక్యూరిటీ జోన్‌గా మారిపోయిన విశాఖ.. ట్రాఫిక్‌ ఆంక్షలు

Vizag

Vizag

Global Investors’ Summit: ఆంప్రదేశ్‌కు భారీగా పెట్టుబడులను రప్పించడం, ఉపాధి కల్పనే లక్ష్యంగా గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ (జీఐఎస్‌)కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రభుత్వం.. ఈ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, మంత్రులు, కార్పొరేట్‌ దిగ్గజాలు విశాఖ చేరుకుంటున్నాయి.. నిన్న ఒక్క రోజే నాలుగు వేలకుపైగా రిజిస్ట్రేషన్స్ నమోదు కాగా ఇప్పటివరకు మొత్తం 12,000కిపైగా నమోదు కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్థలకు విశాఖ నగరం ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమైంది.. ఆరుగురు కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు రెండు రోజులపాటు విశాఖ నుంచే కార్యకలాపాలు కొనసాగించనున్నారు. మార్చి 3న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యే సమావేశాల్లో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్, విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్, పర్యాటక శాఖమంత్రి జి.కిషన్‌రెడ్డి పాల్గొనబోతున్నారు..

Read Also: Meghalaya Election Counting Updates : ఎగ్జిట్ పోల్స్ ను నిజం చేస్తున్న ప్రస్తుత ఫలితాలు

ఇక, జీఐఎస్‌ కోసం ప్రత్యేక అతిథులుగా కార్పొరేట్‌ దిగ్గజ ప్రముఖులు రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ, అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ, ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమారమంగళం బిర్లా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ ఎండీ, సీఈవో సంజీవ్‌ బజాజ్, జేఎస్‌డబ్ల్యూ గ్రూపు చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌ నవీన్‌ జిందాల్, జీఎంఆర్‌ గ్రూప్‌ చైర్మన్‌ గ్రంధి మల్లిఖార్జునరావు, రెన్యూ పవర్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుమంత్‌ సిన్హా, దాల్మియా భారత్‌ గ్రూప్‌ ఎండీ పునీత్‌ దాల్మియా , సైయెంట్‌ ఫౌండర్‌ చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, సెంచురీ ప్లేబోర్డ్స్‌ చైర్మన్‌ సజ్జన్‌ భజాంక, గ్లోబల్‌ అలయన్స్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ ప్లానెట్‌ సెక్రటరీ జనరల్‌ సత్య త్రిపాఠి, పెగాసస్‌ క్యాపిటల్‌ ఫౌండర్‌ సీఈవో క్రైగ్‌ కాట్, పార్లే ఫర్‌ ది అడ్వైజర్స్‌ ఓషన్స్‌ సిరిల్‌ గచ్, శ్రీ సిమెంట్‌ చైర్మన్‌ మోహన్‌ బంగర్, ఒబెరాయ్‌ గ్రూపు ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ అర్జున్‌ ఒబెరాయ్, టెస్లా కో¸ఫౌండర్ మార్టిన్ ఎబర్‌హార్డ్, భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ కృష్ణ ఎల్లా తదితరులు పాల్గొనబోతున్నారు.. దీంతో.. విశాఖలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.. ప్రముఖుల తాకిడి పెరుగుతుండడంతో హై సెక్యూరిటీ జోన్ గా మారిపోయాయి విశాఖ ఎయిర్‌పోర్ట్‌ పరిసర ప్రాంతాలు.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం అసాధారణ భద్రత ఏర్పాటు చేశారు..

Read Also: Nagaland Election Counting Updates : నాగాలాండ్‎లో స్పష్టమైన మోజార్టీతో బీజేపీ కూటమి

ఇక, మూడు రోజుల పర్యటన కోసం ఈ రోజు సాయంత్రం విశాఖ చేరుకోనున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. మంత్రులు ఆర్కేరోజా, వేణుగోపాల కృష్ణ వైజాగ్‌కు రానున్నారు.. ఈరోజు పలువురు పారిశ్రామిక వేత్తలు వచ్చే అవకాశం ఉంది.. ప్రత్యేక విమానంలో జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ మల్లిఖార్జున రావు.. ఇతర ప్రముఖ పారిశ్రామిక వేత్తలు విశాఖ విచ్చేయనున్నారు. మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నేపథ్యంలో విశాఖపట్నంలోని పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు వుంటాయని పోలీస్ కమీషనర్ శ్రీకాంత్ వెల్లడించారు.. ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, దేశ విదేశాలకు చెందిన వ్యాపార ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు విశాఖకు రానున్న నేపథ్యంలో 2500 మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే సమ్మిట్ జరిగే ఏయూ నుండి విమానాశ్రయం వరకు, బీచ్ రోడ్డులో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని.. ట్రాఫిక్‌ రద్దీ, వీఐపీల తాకిడి దృష్ట్యా.. వాహనదారులు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కోరారు.. ఇక, శుక్ర, శనివారాలు బీచ్ కు వెళ్లేవారు తమ వాహనాలను ఏపీఐఐసి గ్రౌండ్ లో పార్క్ చేసుకోవాలని సూచించారు సీపీ శ్రీకాంత్‌.