Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

కేరళ స్టోరీ-2 రిలీజ్‌కు లైన్ క్లియర్.. స్టే ఎత్తేసిన హైకోర్టు..

విడుదలకు ముందే ‘‘ది కేరళ స్టోరీ 2’’కు కేరళ హైకోర్టులో ఊరట లభించింది. కేరళను తప్పుగా చూపించారనే వివాదం నేపథ్యంలో నిన్న కేరళ హైకోర్టు సింగిల్ జడ్జ్ స్టే విధించారు. అయితే, ఈ రోజు కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ సినిమా విడుదలకు అనుమతి ఇచ్చింది. తీర్పు వెలువడిన తర్వాత, సినమా నిర్మాతలు ముంబైలో సాయంత్రం సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సినిమా ఈ రోజు రాత్రి విడుదల అవుతుందని వెల్లడించారు.

ప్రయాణం+దర్శనం ఒక్కటే ప్లాన్‌లో.. తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రత్యేక బస్సు ప్యాకేజీలు..!

తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలనుకునే భక్తుల కోసం వివిధ పర్యాటక సంస్థలు, రవాణా సంస్థలు ప్రత్యేక బస్సు ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఈ ప్యాకేజీల ద్వారా భక్తులు ఎంతో సులభంగా దర్శనం టిక్కెట్లు పొందవచ్చు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల నుండి ఈ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుండి వెళ్లే వారికి తెలంగాణ పర్యాటక శాఖ (TGTDC), అంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ (APTDC) ద్వారా ఏసీ వోల్వో లేదా మెర్సిడెస్ బెంజ్ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు.

కేటీఆర్ పై కవిత ఫైర్.. పార్టీ ఓటమిని నా మెడకు చుడతారా..?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కోర్టు నుంచి క్లీన్ షీట్ లభించిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సోదరుడు కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు తనకు శుభాకాంక్షలు చెబుతూనే, మరోవైపు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడానికి ఈ కేసే కారణమని కేటీఆర్ ట్వీట్ చేయడంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీ ఓటమిని తన మెడకు చుట్టాలని చూడటం సరికాదని హితవు పలికిన కవిత, అసలు తనపై ఈ కేసు పెట్టింది పార్టీ కోసం కాదా అని నిలదీశారు. నాటి క్లిష్ట పరిస్థితుల్లో తాను ఒంటరిగా పోరాటం చేస్తున్నప్పుడు పార్టీ సోషల్ మీడియా గానీ, కేటీఆర్ లేదా కేసీఆర్ గానీ కనీసం ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టి తనకు మద్దతుగా ఎందుకు మాట్లాడలేదని ఆమె సూటిగా ప్రశ్నించారు.

“ఇజ్రాయిల్ వదిలి వెళ్లండి”.. ఇరాన్ ఉద్రిక్తతల మధ్య అమెరికా హెచ్చరిక..

మిడిల్ ఈస్ట్‌లో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరే అవకాశం కనిపిస్తోంది. తాజాగా ఇజ్రాయిల్‌లోని అమెరికా రాయబారి మైక్ హకబీ శుక్రవారం రాయబార కార్యాలయ సిబ్బందితో మాట్లాడుతూ.. ‘‘మీరు ఇజ్రాయిల్ వదిలి వెళ్లాలనుకుంటే ఈరోజే వదిలి వెళ్లండి’’ అని అన్నారు. ఉదయం 10.24 గంటలకు యూఎస్ రాయబార ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌లో.. ‘‘ప్రస్తుతానికి భయపడాల్సిన పనిలేదు, కానీ వెళ్లాలనుకునే వారు వీలైనంత త్వరగా విమానాలు బుక్ చేసుకోవడం మంచిది’’ అని పేర్కొన్నారు.

బుమ్రా రికార్డుకు చెక్ మెట్ పెట్టిన అర్ష్‌దీప్ సింగ్.. భారత్ తరఫున అత్యధిక వికెట్లు!

టీమిండియా ఎడమచేతి ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ టీ20 వరల్డ్ కప్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించాడు. చెన్నై వేదికగా జింబాబ్వేతో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌ లో మూడు కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి మిడిల్ ఆర్డర్‌ ను కుదేలు చేశాడు. సికందర్ రాజా, ర్యాన్ బర్ల్, టోనీ మున్యోంగా వికెట్లు పడగొట్టి భారత్‌కు 72 పరుగుల భారీ విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మూడు వికెట్లతో అర్ష్‌దీప్ రికార్డును అందుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో టీమిండియా తరుఫున ఇప్పటి వరకు 35 వికెట్లను పడగొట్టాడు. దీనితో టీ20 వరల్డ్ కప్‌ లలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు 33 వికెట్లతో జస్ప్రీత్ బుమ్రా పేరిట ఉండేది. ఈ లిస్ట్ లో మూడో స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ 32 వికెట్లతో ఉన్నాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్య 29, రవీంద్ర జడేజా 22 వికెట్లతో ఉన్నారు.

బీజేపీ 10 సీట్లకు పైగా గెలిస్తే, రాజకీయాలు వదిలేస్తా..

ఢిల్లీ లిక్కర్ కేసులో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో సహా మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో సీబీఐ సమర్పించిన సాక్ష్యాలు బలంగా లేవని రౌస్ ఎవెన్యూ కోర్టు పేర్కొంది. ఈ తీర్పు తర్వాత, కేజ్రీవాల్ ప్రధాని మోడీ, అమిత్ షాలపై విరుచుకుపడ్డారు. వీరిద్దరే తనపై కుట్ర చేశారని, ఆప్ లేకుండా చేయాలని తనను జైలుకు పంపారని సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని మోడీకి కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ఒక వేళ ఆ ఎన్నికల్లో బీజేపీ 10 కన్నా ఎక్కువ సీట్లు సాధిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు. ఈ కేసు దేశ చరిత్రలోనే అతిపెద్ద కుట్ర అని అన్నారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు నరకాన్ని చూస్తున్నారని అన్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 48 స్థానాలు గెలుచుకుంది. ఆప్ 22 స్థానాల్లో విజయం సాధించింది. ఢిల్లీలో ఆప్ అధికారాన్ని తొలగించడానికి బీజేపీ కుట్ర చేసిందని కేజ్రీవాల్ ఆరోపించారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు నాకు మోరల్ విక్టరీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు తన పాలిట నైతిక విజయమని (Moral Victory) ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఐదున్నర నెలల పాటు జైలులో ఉంచి తనను మానసిక క్షోభకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె, ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని స్వయంగా జడ్జి తీర్పు ఇవ్వడం ద్వారా కేంద్రం పెట్టినవి తప్పుడు కేసులని ప్రజలకు అర్థమైందని అన్నారు. ఛార్జ్ షీట్ ఫ్రేమ్ చేయమని కోర్టు అనడం అంటేనే ఈ కేసులో దర్యాప్తు సంస్థల వద్ద ఏమీ లేదని తేలిపోయిందని ఆమె స్పష్టం చేశారు.

పెళ్లి తర్వాత తొలిసారి.. ఎయిర్‌పోర్టులో విజయ్ దేవరకొండ, రష్మిక జంట సందడి.!

టాలీవుడ్‌ ప్రేమజంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం అనంతరం తొలిసారిగా ప్రజల ముందుకు వచ్చారు. గురువారం (ఫిబ్రవరి 26)న రాజస్థాన్‌ లోని ఉదయ్‌పూర్ లో సన్నిహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత కేవలం 24 గంటలు గడవకముందే ఈ జంట ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో కలిసి కనిపించడంతో అభిమానులు ఆనందోత్సాహాలతో స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న విజయ్–రష్మిక జంట చేతులు పట్టుకుని చిరునవ్వులతో అభిమానులకు అభివాదం చేశారు. నమస్కారం చేస్తూ, చేతులు ఊపుతూ అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొన్నేళ్లుగా వీరి సంబంధంపై అనేక ఊహాగానాలు వినిపించాయి. అభిమానులు ప్రేమగా “విరోష్” అని పిలిచే ఈ జంట దాదాపు ఎనిమిదేళ్లుగా కొనసాగిన అనుబంధాన్ని పెళ్లిగా మార్చుకున్నారు. తెలుగు హిందూ, కొడవ సంప్రదాయాల ప్రకారం వారి వివాహ వేడుక జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు.

అప్పుడు భారత్, ఇప్పుడు ఆఫ్ఘానిస్తాన్.. పాక్‌లో చైనా వ్యవస్థలు విఫలం..!

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం తీవ్రత పెరిగింది. ఈ రోజు తెల్లవారుజామున పాక్ యుద్ధవిమానాలు కాబూల్, కాందహార్, పక్తియా నగరాలపై దాడులు చేశాయి. ఈ దాడుల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ప్రతీకార దాడులు ప్రారంభించింది. పాక్ రాజధాని ఇస్లా్మాబాద్‌పై డ్రోన్లలో తాలిబాన్లు దాడులు చేశారు. పాక్ ప్రధాని కార్యాయానికి కూతవేటు దూరంలో ఆఫ్ఘాన్ డ్రోన్ దాడి జరిగింది. మరోవైపు, కరాచీలో కూడా పాక్ హై అలర్ట్ ప్రకటించింది. ఇస్లామాబాద్‌లోని ఫైజాబాద్ సమీపంలోని ఒక సైనిక శిబిరం, నౌషెరాలోని ఒక సైనిక కంటోన్మెంట్, జామ్రుద్‌లోని సైనిక కాలనీపై, అబోటాబాద్‌పై దాడులు జరిగాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పెద్దగా వైమానిక శక్తి లేకపోయినా తాలిబాన్ల డ్రోన్లు పాకిస్తాన్ రాజధానిని చేరుకున్నాయి.

పాడె మోస్తూ, తండ్రికి రింకూసింగ్ భావోద్వేగ వీడ్కోలు..

భారత బ్యాటర్ రింకూసింగ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి ఖచంద్ర సింగ్ అనారోగ్యంతో శుక్రవారం తుది శ్వాస విడిచారు. టీ20 ప్రపంచ కప్ సమయంలో రింకూ‌కు తండ్రి మరణం రూపంలో షాక్ తగిలింది. చెన్నైలో జరిగిన జింబాబ్వే మ్యాచ్‌కు ముందే రింకూ తండ్రికి సీరియస్‌గా ఉన్నట్లు తెలియడంతో అతను నోయిడా వెళ్లి వచ్చారు. శుక్రవారం గ్రేటర్ నోయిడాలోని యథర్త్ ఆస్పత్రిలో ఖచంద్ సింగ్ మరణించారు. నాలుగో దశ కాలేయ క్యాన్సర్‌తో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణించడం రింకూ కుటుంబానికి తీరని లోటు మిగిల్చింది.

 

Exit mobile version