Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

కూటమి ప్రభుత్వానికి జగన్ ఫోబియా పట్టుకుంది.. బొత్స సంచలన వ్యాఖ్యలు..

మెడికల్ కాలేజీల ఏర్పాటు పేద వాని వైద్యానికి సంబంధించినదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తాజాగా విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నామన్నారు.. పేదవాడి ఆరోగ్య విషయంలో రాజీపడమన్నారు.. కూటమి ప్రభుత్వానికి జగన్ ఫోబియా పట్టుకుందని తెలిపారు.. ఇంకా ఎన్ని రోజులు జగన్ పేరు చెబుతూ బతుకుతారని ప్రశ్నించారు. కురుపాంలో 39 మంది విద్యార్థులు పచ్చ కామెర్లతో బాధపడుతున్నారని గుర్తు చేశారు. అందులో ఇద్దరు మరణించారన్నారు..

అమెరికాకు పుతిన్ వార్నింగ్.. సంబంధాలను నాశనం చేస్తుందని హెచ్చరిక!

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రోజురోజుకు తీవ్రతరం అవుతుంది కానీ, ముగింపు దిశగా అడుగులు మాత్రం పడటం లేదు. తాజా ఈ యుద్ధంలోకి అమెరికా సూపర్ వెపన్ ఎంట్రీ ఇస్తుందనే వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ వెపన్‌పై, అమెరికా తీరుపై రష్యా అధ్యక్షుడు పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ ఆయన అగ్రరాజ్యానికి ఏమని వార్నింగ్ ఇచ్చారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. రష్యా లోపల సుదూర దాడులు చేయడానికి ఉక్రెయిన్‌కు అమెరికా టోమాహాక్ క్షిపణులను అందిస్తే, ఇది మాస్కో- వాషింగ్టన్‌ల మధ్య సంబంధాలను పూర్తిగా నాశనం చేస్తుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య శిఖరాగ్ర సమావేశం జరిగి రెండు నెలల కన్నా తక్కువ సమయం మాత్రమే గడిచింది. ఈ నేపథ్యంలో తాజాగా పరిణామాల మధ్య మాస్కో-కీవ్‌ల మధ్య శాంతి అనేది మరింత దూరంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్లో రష్యన్ దళాలు ముందుకు సాగుతూనే ఉన్నాయి, రష్యన్ డ్రోన్లు నాటో భూభాగంలోకి ప్రవేశించినట్లు పలు నివేదికలు తెలిపాయి. రష్యా లోపల దాడులు చేసే అవకాశాన్ని ఇప్పుడు అమెరికా బహిరంగంగా పరిశీలిస్తోందని సమాచారం. శాంతి కోసం మధ్యవర్తిత్వం చేయడంలో పుతిన్ అసమర్థతపై ఇటీవల ట్రంప్ నిరాశ వ్యక్తం చేశారు. ట్రంప్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ను లొంగదీసుకోవడంలో విఫలమైన “కాగితపు పులి” అని రష్యాను అభివర్ణించారు.

వాట్సాప్‌లో బిజినెస్ ప్రమోషనల్ మెసేజెస్ కు ఇలా చెక్ పెట్టండి

ఇన్ స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్ కు కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. కాల్స్, మెసేజెస్, ఆడియో, వీడియో రికార్డింగ్ వంటి అనేక ఫీచర్ల ను కలిగి ఉంది. అయితే ఇటీవల బ్యాంకింగ్ సెక్టార్, వ్యాపార సంస్థలు వాట్సాప్ ను యూజ్ చేస్తున్నాయి. ప్రమోషనల్ మెసేజెస్ ను యూజర్లకు పంపిస్తున్నాయి. ఈ సందేశాలు ఆఫర్లు, సేవలు, డిస్కౌంట్ల గురించి ఉండవచ్చు. ఈ పదే పదే వచ్చే WhatsApp సందేశాల వల్ల చాలా మంది చిరాకు పడుతుంటారు. ఆఫీస్ వర్క్ లో ఉన్నప్పుడు, బిజీ టైమ్ లో అంతరాయం కలిగిస్తుంటాయి. ఇలాంటి సమయంలో వాట్సాప్‌లోని ప్రమోషనల్ సందేశాలతో మీరు ఇబ్బంది పడుతుంటే, మీరు వాటిని సులభంగా వదిలించుకోవచ్చు.

గురుగ్రామ్‌లో దారుణం.. ఉపాధ్యాయురాలిపై జిమ్ ట్రైనర్లు గ్యాంగ్‌రేప్

దేశంలో ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మహిళలపై మాత్రం అఘాయిత్యాలు మాత్రం అగడం లేదు. ఎక్కడొక చోట అబలలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ముంబైలో ఒక డెలివరీ బాయ్.. మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటనను మరువక ముందే గురుగ్రామ్‌లో మరో ఘోరం వెలుగు చూసింది. స్నేహితుడి పిలుపు మేరకు పార్టీకి వెళ్లిన పాఠశాల ఉపాధ్యాయురాలిపై అత్యంత దారుణంగా జిమ్ శిక్షకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గురుగ్రామ్‌కు చెందిన ఒక మహిళ భర్తతో కలిసి నివసిస్తుంది. ఒక ప్రముఖ పాఠశాలలో విదేశీ భాషలు బోధిస్తోంది. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన 37 ఏళ్ల గౌరవ్ అనే వ్యక్తి సెప్టెంబర్‌లో జరిగిన ఓ పార్టీలో స్నేహితుడు అయ్యాడు. అనంతరం ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకుని సంభాషించుకుంటున్నారు. అంతేకాకుండా పలుమార్లు వ్యక్తిగతంగా కూడా కలుసుకున్నారు. మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 1న గౌరవ్ ఫోన్ చేసి పర్సనల్‌గా కలుసుకుని మాట్లాడుకుందామని ఆహ్వానించాడు. దీంతో గురుగ్రామ్‌లోని గౌరవ్ స్నేహితుడైన నీరజ్ (32) ఇంటికి రావాలని చిరుమానా పంపించాడు. దీంతో అర్థరాత్రి సమయంలో ఆమె నీరజ్ ఇంటికి చేరుకుంది. ఆమె ఇంటికి రాగానే గౌరవ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కడితో ఆగకుండా స్నేహితులైన నీరజ్, యోగేష్ (29), అభిషేక్ (28) లకు ఫోన్ చేసి రప్పించాడు. అనంతరం ఆ ముగ్గురు కూడా వరుసగా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా నిశ్చేష్టురాలైపోయింది.

2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలనుంది.. రోహిత్ శర్మ వీడియో వైరల్!

ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భారత సెలెక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగొంచి.. శుభ్‌మన్‌ గిల్‌ను సారథిగా ఎంపిక చేశారు. బీసీసీఐ నిర్ణయం క్రికెట్ ప్రపంచంను ఆశ్చర్యంకు గురిచేసింది. సెలెక్టర్ల ఈ నిర్ణయంపై రోహిత్‌ అభిమానులు మండిపడుతున్నారు. ఎందుకంటే రోహిత్ కెప్టెన్సీలో కొన్ని నెలల క్రితం ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని భారత్ గెలుచుకుంది. ఫైనల్‌లో హిట్‌మ్యాన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా కూడా ఎంపికయ్యాడు. ప్రస్తుతం రోహిత్ పేరు ట్రెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో హిట్‌మ్యాన్‌కు సంబంధించిన ఓ పాత వీడియో వైరల్‌గా మారింది. కొన్ని నెలల క్రితం క్రికెట్ జర్నలిస్ట్ విమల్ కుమార్‌తో జరిగిన పాడ్‌కాస్ట్ సందర్భంగా రోహిత్ శర్మ అభిమానులతో మాట్లాడాడు. 2023లో మీ కళ తృటిలో చేజారింది, 2027 ప్రపంచకప్‌లో భారత్‌కు కెప్టెన్‌గా ఉండి మీ కళను నెరవేర్చుకుంటారా? అని విమల్ అడిగినప్పుడు హిట్‌మ్యాన్ భావోద్వేగానికి గురయ్యాడు. ‘అవును, 2027 ప్రపంచకప్‌ ఖచ్చితంగా నా మనసులో ఉంది. 2023లో ఏదైతే నెరవేరలేదో, నేను దానిని 2027లో నెరవేర్చగలిగితే సంతోషంగా ఉంటుంది’ అని రోహిత్ అన్నాడు. ఇప్పుడు రోహిత్ టీమిండియాకు కెప్టెన్‌గా లేడు కాబట్టి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘రోహిత్ ఇప్పుడు కెప్టెన్ కాదు. కానీ అతను 2027 ప్రపంచకప్‌ను ఆటగాడిగా ఆడాలని నేను కోరుకుంటున్నాను’ అని ఓ అభిమాని కామెంట్ చేశాడు. ‘రోహిత్ శర్మను కెప్టెన్‌గా మిస్ అవుతున్నా’ అం మరో అభిమాని పేర్కొన్నాడు.

ట్రాఫిక్ చలాన్ రూల్స్ మారాయి.. తెలుసా.!

రహదారులపై వాహనదారులు ట్రాఫిక్‌ రూల్స్‌ను విరుద్ధంగా పాటిస్తుంటే, ఇకపై కేంద్రం సీరియస్‌ చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ముఖ్యంగా చలాన్ల (Traffic Challans) చెల్లింపులో నిర్లక్ష్యం చూపితే తగిన మూల్యం చెల్లించడం తప్పనిసరిగా, లేదంటే వాహనదారులు భారీ శిక్షలు పొందవచ్చు. కేంద్ర రవాణాశాఖ (Ministry of Road Transport & Highways) ఇటీవల సెంట్రల్‌ మోటార్ వెహికిల్స్ రూల్స్‌-1989 (Motor Vehicles Act, 1989) లో కీలక సవరణలను ప్రతిపాదించింది.

బీసీల రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది

తెలంగాణ ప్రభుత్వం బలహీన వర్గాల సామాజిక న్యాయాన్ని సాధించేందుకు తీసుకున్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల నిర్ణయం రాజ్యాంగబద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అయితే ఈ రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ.. “బీసీల రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు ఎలాంటి నష్టం కలిగించవు. ఇది బలహీన వర్గాలకు చేయూతగా ఉండే నిర్ణయం. రేవంత్ రెడ్డి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి ఆలోచన ప్రకారం ఈ చర్యను ముందుకు తీసుకెళ్తున్నాం” అని పేర్కొన్నారు.

ఛార్జీలపై విమానయాన సంస్థలకు DGCA తీవ్ర హెచ్చరిక..

దీపావళికి ముందు విమాన ప్రయాణ డిమాండ్ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తూ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అధిక టిక్కెట్ ధరల పెంపుపై విమానయాన సంస్థలను హెచ్చరించింది. పండుగ సీజన్‌లో ప్రయాణీకులు అధిక ధరలు చెల్లించాల్సిన అవసరం లేకుండా విమాన సామర్థ్యాన్ని పెంచాలని, ఛార్జీలను తక్కువగా ఉంచాలని నియంత్రణ సంస్థ అన్ని దేశీయ విమానయాన సంస్థలను ఆదేశించింది. ఒక ప్రకటనలో, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రయాణీకులపై అధిక టిక్కెట్ రేట్ల భారం పడకుండా చూసేందుకు విమానయాన సంస్థలతో చురుగ్గా వ్యవహరిస్తోందని తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన విమాన మార్గాల్లో ఛార్జీలను సమీక్షించిన తర్వాత ఈ చర్యకు పూనుకుంది.

తెలంగాణలో నాలుగు రోజుల పాటు కుండపోత వర్షాలు

తెలంగాణ రాష్ట్రం మరోసారి భారీ వర్షాల ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు తెలిపారు. వర్షాల తీవ్రత దృష్ట్యా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు. అధికారుల వివరాల ప్రకారం, రాష్ట్రంలోని అధికభాగం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, కొన్నిచోట్ల మాత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వానలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ సమయంలో వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండటం, గాలి దిశల్లో మార్పులు చోటుచేసుకోవడం వర్షాల తీవ్రతను పెంచే అవకాశం ఉన్నట్లు సూచించారు.

పచ్చకామెర్లతో విద్యార్థులు మృతి.. మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన..

మన్యం జిల్లాలో పచ్చకామెర్లతో విద్యార్థులు మృతి చెందటంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.. ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. కూటమి ప్రభుత్వం పాలనలో నిర్లక్ష్యం, అలసత్వం కారణంగా ఇవాళ పేద విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడ్డారు. అయినా వాళ్లకు కనికరం కూడా లేదని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. “చంద్రబాబు.. పాలనలో మీ నిర్లక్ష్యం, మీ అలసత్వం కారణంగా ఇవాళ పేద విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా మీకు కనికరం కూడా లేదు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం బాలికల గిరిజన గురుకుల పాఠశాలలో ఆర్వోప్లాంటు పాడవడంతో కలుషిత నీరుతాగడం మూలాన, పచ్చకామెర్లు సోకి 4రోజుల వ్యవధిలోనే ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి, మీ పరిపాలనకు ఇది సిగ్గుచేటు వ్యవహారం కాదా? 611 మంది చదువుతున్న స్కూళ్లో ఇంత జరుగుతున్నా అసలు పట్టించుకోరా? ఒక ప్రభుత్వం స్పందించాల్సిన తీరు ఇదేనా? ముఖ్యమంత్రిగా మీరు, ఇంతమంది మంత్రులు ఉండి గాడిదలు కాస్తున్నారా? గిరిజన బాలికలు, పేద పిల్లలు అంటే అంత చులకనా? ఒక్క పార్వతీపురం మన్యం జిల్లాలోనే ఒక్క ఏడాదిలో 11 మంది విద్యార్థులు అనారోగ్యంతో మరణించినా మీరు కళ్లుమూసుకున్నమాట వాస్తవం కాదా? ఈ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే చంద్రబాబుగారూ.

 

Exit mobile version