ఎమ్మెల్యే నా కొడకల్లారా అంటూ వేదికపైనే.. పవన్ అసహ్యంగా మాట్లాడలేదా?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. మీరు అసహ్యంగా మాట్లాడితే ఒప్పు, మేము మాట్లాడితే తప్పా? అని ప్రశ్నించారు. అసహ్యంగా మాట్లాడినందుకే దాడులు జరుగుతున్నాయని పవన్ మాట్లాడుతున్నారని, ఆయన మాటలు విని పశ్చాత్తాపపడ్డాను అని తెలిపారు. పవన్.. మీరు ఎప్పుడూ అసహ్యంగా మాట్లాడలేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అని వేదికపై చెప్పు తీశావు, అప్పుడు నేను ఎమ్మెల్యేనే కదా? అని అడిగారు. నా కొడకా అంటే అర్దం తెలుసా.. ఇప్పటికైనా పశ్చాతాపం పడ్డావా? అని ప్రశ్నించారు. అన్యాయాన్ని అన్యాయం అనలేని నువ్వు.. ఏం డిప్యూటీ సీఎంవు అని అంబటి ధ్వజమెత్తారు.
ఢిల్లీ ఏఐ సమ్మిట్లో షాకింగ్ ఘటన.. యూత్ కాంగ్రెస్ హల్చల్
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. హఠాత్తుగా ఢిల్లీ యూత్ కాంగ్రెస్కు చెందిన కార్యకర్తలు లోపలికి ప్రవేశించి నానా హంగామా సృష్టించారు. చొక్కాలు విప్పి హల్చల్ చేశారు. అమెరికాతో ట్రేడ్ డీల్ రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ పరిణామంతో నిర్వాహకులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవడంపై నిరసనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు భారత్ మండపంలో ఏఐ సమ్మిట్ జరుగుతోంది. ఈ సమావేశానికి ప్రపంచ దేశాల నుంచి అతిథులు వచ్చారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సహా అనేక దేశాధినేతలు పాల్గొన్నారు. అయితే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఏఐ సమ్మిట్ను విమర్శించారు. ‘‘అస్తవ్యస్తమైన ప్రజా సంబంధాల ప్రదర్శన’’ అని అభివర్ణించారు. చైనా ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా తీవ్రంగా తప్పుపట్టారు.
రేగోడ్ కస్తూర్బా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. అస్వస్థతకు గురైన 22 మంది విద్యార్థినిలు
మెదక్ జిల్లాలోని రేగోడ్ కస్తూర్బా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఉదయం టిఫిన్ చేసిన అనంతరం 22 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. వీరితో పాటు ముగ్గురు ఉపాధ్యాయులు కూడా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో పాఠశాల సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వెంటనే వారిని రేగోడ్ PHC కి తరలించారు. రేగోడ్ ప్రభుత్వాసుపత్రిలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు చికిత్స అందిస్తున్నారు. ఇటీవల పలు పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, ఈ ఘటనలకు బాధ్యులైన వారిపై చర్యుల తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
సూపర్-8 టీమ్ ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలో జింబాబ్వే, భారత్ స్థానం ఎంతంటే?
టీ20 ప్రపంచకప్ 2026లో లీగ్ దశ ముగిసింది. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, జింబాబ్వే, వెస్టిండీస్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు సూపర్-8కు చేరాయి. మ్యాచులు శనివారం (ఫిబ్రవరి 21) నుంచి ఆరంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సూపర్-8కు చేరిన జట్లపై అభిమానులు, నిపుణులు తమ తమ అంచనాలు, అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఓ విశ్లేషణ ప్రకారం.. లీగ్ రౌండ్ దశ ప్రదర్శన ఆధారంగా జట్ల ర్యాంకింగ్ ఆసక్తికరంగా ఉంది. ఈ జాబితాలో అగ్రస్థానంలో జింబాబ్వే నిలవడం విశేషం. ఎవరూ ఊహించని విధంగా వారు బలమైన ఆస్ట్రేలియాను, ఆతిథ్య శ్రీలంకను ఓడించడం ఆ జట్టు ప్రతిభకు నిదర్శనంగా భావిస్తున్నారు.
పాకిస్తాన్ ట్రాప్లో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్.. యూనస్ సంతోషం కోసమే డ్రామా..
భారతదేశానికి వ్యతిరేకంగా, భద్రతా కారణాలు చూపుతూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భారత వేదికలపై ఆడనంటూ రచ్చ చేసింది. తమ వేదికల్ని శ్రీలంకకు మార్చాలని డిమాండ్ చేసింది. దీనికి ఐసీసీ(ICC) ఒప్పుకోలేదు. ఫలితంగా బంగ్లాదేశ్ ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్( T20 World Cup 2026) నుంచి బయటకు వెళ్లింది. అయితే, అప్పటి బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్ పాకిస్తాన్తో కలిసి భారత్కు వ్యతిరేకంగా ఆడిన ఆటలో బంగ్లాదేశ్ క్రికెట్ బలైంది. ఇదిలా ఉంటే, తాజాగా ఈ వివాదంపై మాజీ ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) సీఈఓ సయ్యద్ అష్రఫుల్ హక్ సంచలన వ్యాక్యలు చేశారు. భారత్కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఉచ్చులో పడినట్లు ఆయన చెప్పారు. ‘‘బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ చీఫ్ అమీనుల్ ఇస్లాం బుల్బుల్ ప్రభుత్వాన్ని సంతోషపెట్టడం కోసం ఉచ్చులో పడ్డాడు’’ అని అన్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) చైర్మన్ మోహ్సీన్ నఖ్వీ, అమీనుల్ ఇస్లాంను తప్పు దారి పట్టించి ఉండొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ను పాకిస్తాన్ రెచ్చగొట్ట ఉండొచ్చని అన్నారు.
ప్రధానికి రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి.. దేశం కోసం ‘ఏఐ కౌన్సిల్’ కావాలి..
కృత్రిమ మేధ (AI) అనేది మానవ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆవిష్కరణ అని, అది మనిషి మేధోశక్తిని సైతం దాటి ఆలోచించగల సామర్థ్యాన్ని కలిగి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కొనియాడారు. ఢిల్లీలో నిర్వహించిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో పాల్గొన్న ఆయన, ఏఐ టెక్నాలజీ భవిష్యత్తులో మన జీవితాలను, ముఖ్యంగా వ్యవసాయం వంటి కీలక రంగాలను అనూహ్యంగా మార్చబోతోందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఏఐ వినియోగాన్ని క్రమబద్ధీకరించడానికి , ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వానికి ఆయన పలు విప్లవాత్మక సూచనలు చేశారు.
ఎల్బీనగర్ చట్నీస్ హోటల్లో పేలుడు.. పరుగులు తీసిన కస్టమర్స్..
హైదరాబాద్ లోని ప్రముఖ రెస్టారెంట్ ‘చట్నీస్’ (Chutneys)లో శుక్రవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఎల్బీనగర్లోని ఆర్ఆర్ జిల్లా కోర్టు సమీపంలో ఉన్న ఈ రెస్టారెంట్లో జరిగిన ప్రమాదంతో కస్టమర్లు, సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు. కిచెన్లోని ఇడ్లీ స్టీమర్ ఒక్కసారిగా పేలిపోవడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. శుక్రవారం (ఫిబ్రవరి 20) మధ్యాహ్నం సుమారు 12 గంటల ప్రాంతంలో రెస్టారెంట్ కిచెన్లో వంట పనులు జరుగుతుండగా, ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ఇడ్లీ స్టీమర్ పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి కిచెన్లోని పరికరాలు చిందరవందరగా పడిపోయాయి. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో హోటల్లో ఉన్న కస్టమర్లు భయాందోళనలకు గురై బయటకు పరుగులు తీశారు.
తమిళనాడులో సంచలనం.. స్టాలిన్ పార్టీలోకి ఓపీఎస్.!
తమిళనాడులో ఎన్నికలు దగ్గర పడుతున్నాకొద్ది రాజకీయ ముఖచిత్రం మారుతోంది. గతంలో డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య ఉన్న ద్విముఖ పోరు ఇప్పుడు, యాక్టర్ విజయ్ పార్టీ టీవీకే ఎంట్రీతో త్రిముఖపోరుగా మారింది. ఈ ఎన్నికల వేడిలో రాజకీయం హాట్ హాట్గా మారింది. తాజాగా, అన్నాడీఎంకే నుంచి బహిష్కరించబడిన మాజీ సీఎం ఓ. పన్నీర్ సెల్వం(ఓపీఎస్), డీఎంకే అధినేత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను కలవడం సంచలనంగా మారింది. ఇద్దరు నేతల మధ్య జరిగిన సమావేశం ఆసక్తిని పెంచింది. దివంగత విజయ్కాంత్ డీఎండీకే పార్టీ డీఎంకే నేతృత్వంలోని కూటమిలో చేరింది. ఇప్పుడు పన్నీర్ సెల్వాన్ని డీఎంకేలోకి తీసుకురావడానికి ప్లాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీని కోసమే పన్నీర్ సెల్వంతో చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ చర్చల్లో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఓపీఎస్ కుమారుడు కూడా ఉన్నాడు. ఎన్డీయేలో చేరకుండా స్వతంత్రంగా ఉండగలరా? అని స్టాలిన్ ఓపీఎస్ను అడిగినట్లు సమాచారం.
ఇకపై విమానంలో ‘వీరంగాలు’ చెల్లవ్.. బాసు కొత్త రూల్స్ తెలుసా!
విమానంలో ప్రయాణించేటప్పుడు ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా లేదంటే తోటి వారి భద్రతకు ముప్పు తెచ్చే ప్రవర్తనను “వికృత ప్రవర్తన” గా పరిగణిస్తూ DGCA ఆరు కొత్త రకాల తప్పులను రూల్స్ బుక్లోకి ఎక్కించింది. పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ జారీ చేసిన కొత్త ఉత్తర్వులో ఏం చెప్పారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఎవరైనా ఇలాంటి పనులు చేస్తూ దొరికిపోతే, విమానయాన సంస్థలు వారిని 30 రోజుల పాటు విమానం ఎక్కకుండా నేరుగా నిషేధించవచ్చు. దీని కోసం ఎలాంటి కమిటీ విచారణ అవసరం లేదు. విమాన భద్రతకు హాని కలిగిస్తే అది నేరంగా పరిగణించి, నిందితులపై చట్టపరమైన శిక్షలు కూడా తీసుకోవచ్చు. ప్రయాణీకుడు సిబ్బంది మాట వినకుండా వికృతంగా ప్రవర్తిస్తుంటే, పైలట్ వెంటనే ఆ విషయాన్ని సంబంధిత విభాగానికి తెలియజేస్తారు. విమానాన్ని దారి మళ్లించి, దగ్గరలోని విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తారు. విమానం ల్యాండ్ అవ్వగానే అక్కడి భద్రతా సిబ్బంది ఆ ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకుని తగిన చర్యలు చేపడతారు. నిజానికి విమాన ప్రయాణం అనేది అందరి భద్రతతో కూడుకున్నది. ఒక్క ప్రయాణీకుడి తప్పు వల్ల విమానంలోని వందలాది మంది ప్రాణాలకు ముప్పు కలగవచ్చు, అందుకే DGCA ఈ నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అల్లు అర్జున్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. షాక్ ఇచ్చిన కోర్టు..
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కొత్త చిక్కు వచ్చి పడింది. నాంపల్లి కోర్టు ఛార్జ్షీట్ను తిప్పిపంపింది. ఇప్పటికే రెండుసార్లు ఛార్జ్షీట్ను రిటర్న్ చేసింది నాంపల్లి కోర్టు. అల్లుఅర్జున్ సహా 23 మందిపై ఛార్జ్షీట్ దాఖలు అయిన విషయం తెలిసిందే. దాఖలు చేసిన ఛార్జ్షీట్లో లోపాలు ఉన్నట్లు గుర్తించింది. పోలీసుల ఛార్జ్షీట్లో సాంకేతిక లోపాలు గుర్తించింది కోర్టు. హార్డ్ డిస్క్లు, సీడీలు, పెన్ డ్రైవ్లు జతపరచకపోవడంతో ఛార్జ్షీట్ను రిటర్న్ చేసింది. ఇదిలా ఉండగా.. పుష్ఫ 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. గత కొన్ని నెలలనుంచి శ్రీతేజ్ సికింద్రాబాద్లోని కిమ్స్లో చికిత్స పొందాడు. అనంతరం శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉండటంతో డాక్టర్లు అతడ్ని డిశ్చార్జ్ చేశారు. అయితే.. ఈ ఘటనపై 23 మందిపై కేసు నమోదైంది. ఈ ఛార్జ్షీట్లో లోపాలు ఉన్నట్లు తేల్చిన కోర్టు దాన్ని తిప్పిపంపింది.
