Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

0, 0, 0.. అభిషేక్ షర్మ ఫామ్‌పై సూర్య ఏమన్నాడంటే?

టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రస్తుత ఫామ్‌పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ బ్యాట్‌తో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా.. అభిషేక్ సామర్థ్యంపై జట్టుకు ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశాడు. ప్రతి ఆటగాడికి ఎత్తుపల్లాలు సహజమని, అలాంటి దశను ఇప్పుడు అభిషేక్ ఎదుర్కొంటున్నాడని తెలిపాడు. ఎన్నో అంచనాల మధ్య టీ20 ప్రపంచకప్‌ 2026లో అడుగుపెట్టిన అభిషేక్.. వరుసగా మూడు డకౌట్స్ అయ్యాడు. దాంతో అతడిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్‌ మ్యాచ్ అనంతరం ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు కెప్టెన్ సూర్య సమాధానం ఇచ్చాడు.

ముగిసిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతల సమావేశం.. “ప్రజల తెలంగాణ” లక్ష్యం దిశగా చర్చలు!

ఢిల్లీలోని మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌కు సంబంధించిన కీలక సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు పలువురు మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట రెడ్డి, దామోదర రాజనర్సింహా, అడ్లూరి లక్ష్మణ్, అజహరుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్, పార్టీ ప్రస్తుత పరిస్థితులు, ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై సమగ్రంగా చర్చ జరిగింది.

రెండు నెలల రెక్కీ.. వనస్థలిపురం హత్య కేసులో సంచలన విషయాలు..!

హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం వివేకానంద నగర్‌ లో చోటుచేసుకున్న మహిళ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్రకు చెందిన సునితను ఆమె మొదటి భర్త దేవరకొండ మహేశ్ దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. పెద్దపల్లి జిల్లా మంథని గ్రామానికి చెందిన మహేశ్, గతంలో సునితను వివాహం చేసుకుని ఆమెను కెనడాకు తీసుకెళ్లాడు. అయితే అక్కడ భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తడంతో మహేశ్ తిరిగి భారత్‌ కు వచ్చాడు. అనంతరం సునిత అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మహేశ్‌ పై లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో మహేశ్ కెనడాకు తిరిగి వెళ్లలేక భారత్‌లోనే ఉండిపోయాడు. చివరకు 2024లో మహేశ్, సునిత విడాకులు తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. సునిత తరువాత త్రినాథ్ అనే యువకుడిని ప్రేమించి రెండో వివాహం చేసుకుని వనస్థలిపురం ప్రాంతంలో నివసిస్తోంది.

బ్యాండ్‌ లేదు.. తంతు లేదు.. సచివాలయంలో దండలతో ఒక్కటైన ఐఏఎస్ జంట

ప్రస్తుతం కాలంలో పెళ్లిళ్లు ఏం రేంజ్‌లో జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. గొప్పలకు పోయి కోట్లు కుమ్మరిస్తున్నారు. ఇక సామాన్యులైతే కనీసనం లక్షల్లోనైనా చాలా గ్రాండ్‌గా జరిపిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో నడుస్తున్న ట్రెండ్. అలాంటిది దేశంలోనే అత్యున్నత పదవిలో ఉన్న ఇద్దరు బ్యూరోక్రాట్లు చాలా సింపుల్‌గా.. ఎలాంటి హంగామా లేకుండా.. ఎలాంటి బ్యాండ్ మేళా లేకుండా.. అలంకరణ.. డీజేలు లేకుండా కేవలం దండలు మార్చుకుని తంతు ముగించేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది. మాధవ్ భరద్వాజ్-అదితి వాష్ణ్యే ఇద్దరూ కూడా 2023 బ్యాచ్‌కు చెందిన యువ ఐఏఎస్‌లు. ఐఏఎస్ శిక్షణ సమయంలో స్నేహం కాస్త ప్రేమగా మారింది. అప్పటి నుంచి వారి మధ్య బంధం కొనసాగుతోంది. అయితే ఇరు కుటుంబాల అంగీకారం కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా రెండు కుటుంబాలు పెళ్లికి గ్రీన్‌సిగ్నల్స్ ఇచ్చేశాయి. దీంతో ఎగిరి గంతేసిన జంట.. పెళ్లి మాత్రం చాలా సింపుల్‌గా ముగించేశారు.

2028 T20 Worldcup.. డైరెక్ట్ ఎంట్రీ సాధించిన 12 జట్లు..!

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) 2028లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న 2026 వరల్డ్ కప్‌లో సూపర్ 8కు చేరిన జట్ల ఆధారంగా తదుపరి టోర్నీకి నేరుగా అర్హత సాధించే టీమ్స్‌ను దాదాపు ఖరారు చేసింది. నిబంధనల ప్రకారం ఆతిథ్య దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు నేరుగా అర్హత సాధించగా.. 2026 ఎడిషన్‌లో సూపర్ 8కు చేరిన భారత్, పాకిస్తాన్, వెస్టిండీస్, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, జింబాబ్వే జట్లు కూడా తమ స్థానాలను భద్రపరుచుకున్నాయి. మొత్తం 20 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీలో ఇప్పటికే 9 జట్లు డైరెక్ట్ ఎంట్రీని ఖాయం చేసుకున్నాయి.

మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. దారుణ విషయాలు వెలుగులోకి!

హైదరాబాద్ శివార్లలోని నార్సింగి ప్రాంతంలో అదృశ్యమైన మైనర్ బాలిక కేసు సంచలన మలుపు తిరిగింది. మూడు రోజుల క్రితం పుప్పాలగూడా పాషా కాలనీలోని తన ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. తమ కూతురు కనిపించడం లేదంటూ వారు నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు. దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో బాలిక అదృశ్యం వెనుక దారుణ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం.. సోహెల్ అనే యువకుడు బాలికను నమ్మించి తనతో పాటు బయటకు తీసుకెళ్లాడు. అనంతరం ఘట్‌కేసర్ సమీపంలోని రాంపూర్ ప్రాంతానికి తీసుకెళ్లి, తన స్నేహితులు అర్బాజ్, ఇమ్రాన్‌తో కలిసి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితులు గంజాయి సేవించిన అనంతరం బాలికపై ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బాలికను మోసం చేసి తీసుకెళ్లి, పథకం ప్రకారం ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు వెంటనే చర్యలు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

కెప్టెన్‌గా సూర్యకుమార్ అజేయ రికార్డు.. టీ20ల్లో ఒక్క ఓటమి లేదు!

భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. అతని కెప్టెన్సీలో భారత్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు సూర్య నాయకత్వం వహించిన ఒక్క టీ20 సిరీస్ కూడా భారత్ ఓడిపోలేదు. ఈ గణాంకాలు సూరీడి కెప్టెన్సీ స్థాయి ఎలా ఉందో ఇట్టే తెలియజేస్తున్నాయి. టీ20ల్లో కెప్టెన్‌గా సూర్యకుమార్ అజేయ రికార్డు ఏంటో ఓసారి చూద్దాం. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో సిరీస్ ఫలితాలను పరిశీలిస్తే.. ఆస్ట్రేలియాపై 4-1, మరోసారి కంగారో జట్టుపై 2-1తో టీమిండియా గెలుపొందింది. దక్షిణాఫ్రికాపై 1-1 డ్రా, ఆ తరువాత 3-1 విజయం అందుకుంది. అలాగే శ్రీలంకపై 3-0, బంగ్లాపై 3-0,ఇంగ్లండ్ జట్టుపై 4-1, న్యూజీలాండ్ పై 4-1 విజయాలు టీంఇండియా అందుకుంది. అంతేకాదు సూర్య నాయకత్వంలో భారత్ ఆసియా కప్ టైటిల్‌ను కూడా సొంతం చేసుకుంది.

దోచుకో.. పంచుకో.. తినుకో అన్నట్లు ఉంది వీళ్ల వ్యవహారం..

మన రాష్ట్ర పురోగతి అట్టడుగున ఉందని..కానీ వృద్ధిరేటులో దూసుకుపోతున్నట్లు చంద్రబాబు చెప్తున్నారని మాజీ సీఎం జగన్ అన్నారు.. చంద్రబాబు ఎవరికి చెవిలో పూలు పెడుతున్నారు.. తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన రాష్ట్ర పరిస్థితులపై మాట్లాడారు. చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు పక్కదోవ పట్టాయన్నారు.. దోచుకో.. పంచుకో.. తినుకో అన్నట్లుగా టీడీపీ నేతల వ్యవహారం ఉందని విమర్శించారు.. వనరులు మొత్తం దోచేస్తున్నారన్నారు.. ఆయనకు ఒక విమానం.. దాంతో ఒక హెలికాఫ్టర్ ఉందని.. లోకేష్, పవన్‌కు కూడా సేమ్ అలాగే ఉన్నాయన్నారు. కొలంబో వెళ్ళి మ్యాచ్ చూస్తాడు.. తర్వాత రోజు ఉదయాన్నే విజయవాడ వస్తారని విమర్శించారు.. ప్రైవేట్ ఫ్లైట్ కొలంబో వెళ్ళి మ్యాచ్ చూస్తారు.. టీవీలో చూస్తే మ్యాచ్ కనిపించదా?.. నేను కూడా మ్యాచ్ టీవీలోనే చూశానన్నారు. అప్పులపై మళ్ళీ మళ్ళీ గోబెల్స్ ప్రచారాలు చేస్తున్నారని.. ఎన్నిసార్లు సాక్ష్యాలు, ఆధారాలు చూపినా అదే అబద్ధాలు ఆడుతున్నారన్నారు.. కుక్క తోక వంకర అన్నట్లుగా చంద్రబాబు వ్యవహారం ఉందని తీవ్రంగా విమర్శించారు.. ప్రజలకు తెలిసిపోతుంది అని బడ్జెట్ పేపర్స్ లో అప్పుల టేబుల్ ఎత్తివేశారన్నారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. ఇక్కడ దాచిపెట్టవచ్చు కానీ ఇతర నివేదికల్లో ఏమీ చేయలేరని తెలిపారు..

యూనస్ ఎగ్జిట్.. భారత క్రికెట్ సంబంధాల కోసం బంగ్లాదేశ్ తాపత్రయం..

టీ20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ సర్కార్ తన రాజకీయ స్వలాభం కోసం భారత్‌ను బూచిగా చూపించే విధంగా గేమ్ ఆడారు. బంగ్లా ప్లేయర్లు భారత్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నా.. భారత్‌తో భద్రతా సమస్యలు ఉన్నాయని తమ టీం అక్కడ ఆడదంటూ వితండవాదం చేశారు. చివరకు ఐసీసీ బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి నిషేధించింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం తారిక్ రెహ్మాన్ నేతృత్వంలో బీఎన్పీ ప్రభుత్వం అక్కడ అధికారంలోకి వచ్చింది. మహ్మద్ యూనస్ అధికారం పోయింది. దీంతో, ఇప్పుడు భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని చూస్తోంది. క్రికెట్ సంబంధాలను మళ్లీ నెలకొల్పాలని బంగ్లా కొత్త క్రీడా మంత్రి అమీనుల్ హక్ భావిస్తున్నారు. భారత డిప్యూటీ హైకమిషనర్‌తో చర్చలు జరిపినట్లు హక్ చెప్పారు. ‘‘స్నేహపూర్వకం చర్చల’’ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మొత్తం వివాదానికి కారణమైన బంగ్లాదేశ్ బోర్డును కూడా హక్ విమర్శించారు. పొరుగుదేశాలో స్నేహపూర్వక సంబంధాలు పెంచుకోవాలని ఆయన అన్నారు. దౌత్యపరమైన సమస్య కారణంగా బంగ్లా టీం టీ20 వరల్డ్ కప్ ఆడలేకపోయిందని, ఒక వేళ చర్చించి పరిష్కరించుకుంటే ఇప్పుడు తమ టీం టోర్నీలో ఆడుతూ ఉండేదని ఆయన అన్నారు.

తెలంగాణకు కేసీఆర్ ఎలా జాతిపిత అయ్యాడు.?

తెలంగాణ రాజకీయాల్లో ‘జాతిపిత’ అనే పదం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. బీఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌ను ఆయన పార్టీ నేతలు ‘తెలంగాణ జాతిపిత’గా అభివర్ణించడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రంగా తప్పుబట్టారు. భారతదేశానికి జాతిపిత ఒక్కరేనని, ఆయన మహాత్మా గాంధీ అని.. అలాంటి మహనీయుడితో కెసిఆర్‌ను పోల్చడం గాంధీజీని అవమానించడమేనని ఆయన మండిపడ్డారు. అసలు కెసిఆర్ కు జాతిపిత అని చెప్పుకోవడానికి సిగ్గుండాలని ఆయన అత్యంత ఘాటుగా విమర్శించారు. నిజంగానే కెసిఆర్ జాతిపిత అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన ఎందుకు స్పందించడం లేదని కడియం శ్రీహరి ప్రశ్నించారు. ప్రజల కోసం పోరాడాల్సిన ప్రతిపక్ష నేత, అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఎక్కడ ఉన్నారని ఆయన నిలదీశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎందుకు నిలదీయడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం సెంటిమెంట్‌ను వాడుకుని రాజకీయాలు చేయడం తప్ప, క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యకు వచ్చి వారి కష్టాలను తీర్చే ఉద్దేశం కెసిఆర్‌కు లేదని ఎద్దేవా చేశారు.

 

Exit mobile version