Bandi Sanjay: బీఆర్‌ఎస్‌తో బీజేపీ ఎప్పుడూ పొత్తు పెట్టుకోలేదు..!

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. ‘ఇండియన్ కాంగ్రెస్ కాదు.. ఇటలీ కాంగ్రెస్’ అంటూ వ్యాఖ్యానించారు. వందేమాతరం విషయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును ప్రతి భారతీయుడు గమనించాలని అన్నారు. వందేమాతరం భారతమాతకు అర్పించే వందనం అని, స్వాతంత్ర్య ఉద్యమంలో ఈ గీతం కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. దేశ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవడమే నిజమైన దేశభక్తి అని బండి సంజయ్ అన్నారు. ఎంఐఎం వందేమాతరాన్ని బహిష్కరిస్తే.. కాంగ్రెస్ దానిని అవమానించిందని ఆరోపించారు. పార్లమెంట్‌ చేసిన చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

నీట్ లీకేజీపై కేంద్రం చర్యలు తీసుకుంది
నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ అంశంపైనా బండి సంజయ్ స్పందించారు. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని, నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారని తెలిపారు. విద్యార్థుల్లో రాజకీయ పార్టీలు విషబీజాలు నాటొద్దని సూచించారు.

కాంగ్రెస్–బీఆర్‌ఎస్‌ మధ్య లోపాయికారీ ఒప్పందం: బండి సంజయ్
తెలంగాణలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని బండి సంజయ్ ఆరోపించారు. బీఆర్‌ఎస్‌తో బీజేపీ ఎప్పుడూ కలిసి పోటీ చేయలేదని, అధికారాన్ని కూడా పంచుకోలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండు పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని వ్యాఖ్యానించారు. ఇక, డ్రగ్స్‌ వ్యవహారం, ఫోన్‌ ట్యాపింగ్‌, ఫార్ములా కార్‌ రేస్‌, విద్యుత్‌ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టు తదితర అంశాల్లో గతంలో కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలను బండి సంజయ్‌ ప్రస్తావించారు. ఈ అంశాల్లో ఆరోపణలు చేసిన తర్వాత చర్యలు ఏమయ్యాయని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయా వ్యవహారాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణలో బీజేపీ సొంతంగా అధికారంలోకి వస్తుంది
తెలంగాణలో డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, నిధుల సమీకరణ, అప్పుల భారాన్ని తగ్గించేందుకు బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎవరితోనూ పొత్తు లేకుండా సొంతంగా పోటీ చేసి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వం ఉంటే మరింత వేగంగా నిధులు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావచ్చని అన్నారు. తెలంగాణలో బీజేపీకి ప్రజల మద్దతు పెరుగుతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు కేంద్రమంత్రి బండి సంజయ్‌..