తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడంలో మాటల యుద్ధం రోజురోజుకీ తారస్థాయికి చేరుతోంది… ఏపీ సీఎం వైఎస్ జగన్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తెలంగాణ విద్యుత్శాఖ మంత్రి జగదీష్రెడ్డి… ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం లేఖ రాయడంపై మండిపడ్డ ఆయన.. తండ్రిని మించిన దుర్మార్గుడు వైఎస్ జగన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. సమస్యను సృష్టించిందే ఆంధ్ర సర్కార్ అని విమర్శించిన ఆయన.. హైదరాబాద్ నీటి అవసరాలు పట్టవా? కోర్టుకిచ్చిన మాటను తప్పిందేవరు.? సర్వేల పేరిట నిర్మాణాలు కొనసాగిస్తోంది నిజం కాదా..? జీవోల పేరిట చిలకపలుకులు పలుకుతున్నారు.. తెలంగాణ అవసరాల కోసం ఒక్క జీవోను ఇచ్చారా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
మద్రాస్కు మంచినీటి పేరుతో వైఎస్ రాజశేఖరరెడ్డి.. కృష్ణా నీళ్లను దోచుకున్నారు.. సాగర్ ఎడమ కాలువ కింద రైతాంగానికి 50 ఏండ్లు ద్రోహమే చేశారని మండిపడ్డారు జగదీష్రెడ్డి.. ఏడేళ్లు కరువులోనూ కృష్ణా డెల్టాకు నీళ్లు వదిలారు.. ఎడమ కాలువ ఎట్టుమీద కుడికాలువ కింది భాగంలో ఉందని.. హుకుంలు జారీ చేయడం, దౌర్జన్యం, బెదిరింపులతో శ్రీశైలం, సాగర్ గేట్లు తెరిపించారని.. ఆడుకుంటాం.. వాడుకుంటాం అంటే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణ హక్కుల్ని ఎవరూ హరించ లేరన్న జగదీష్ రెడ్డి.. చట్టపరంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.. శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందే జలవిద్యుత్ ఉత్పత్తి కోసమని స్పష్టం చేశారు. రైతులు ఎక్కడైనా రైతులే.. ఇరు రాష్ట్రాలకు పనికి వచ్చే ఫార్ములాను ముందుకు తెచ్చిందే ముఖ్యమంత్రి కేసీఆర్ అని.. ఫార్ములాను పక్కన పెట్టి అహంకారంతో పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో తెలంగాణది ఏ మాత్రం తప్పులేదు.. తప్పు చేసినొళ్లే లేఖల పేరుతో పరిహాసం ఆడుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి జగదీష్ రెడ్డి.