ఏపీలో రాజకీయాలు భగ్గుమన్నాయి. గత మూడు రోజులుగా టీడీపీ నేతలు, వైసీపీ నేతలు మాటలతో యుద్ధ చేసుకుంటున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాస్ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు కౌంటర్ ఇచ్చారు. పదవి దిగాక గౌతమ్ సవాంగ్ పరిస్థితేంటో ఆలోచించుకోవాలి అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా సీఎం జగన్ ఏదో అంటే బీపీ వచ్చి పార్టీ కార్యాలయంపై దాడి చేశారంట.. గతంలో చంద్రబాబును దుర్భాషలాడితే మాకూ బీపీ రాలేదనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు.
‘తాడేపల్లి కొంపను కూల్చాలని మా కార్యకర్తలు అంటున్నారు.. కానీ ఆ కొంప ఇప్పటికే కూలింది.. ఆ అవసరం లేదు. మేమూ మీ భాష మాట్లడగలం.. ఏంట్రా నా కొడకల్లారా అని అనగలం కానీ సంస్కారం అడ్డు వస్తోంది. వైసీపీని గోయ్యి తీసి పాతేందుకు ప్రణాళిక వేసుకున్నాం. చంద్రబాబు మంచిగా ఉండొచ్చు కానీ.. టీడీపీలో అందరూ చంద్రబాబు అంత మంచిగా ఉండరు. వైసీపీ నేతల తరహాలో బరితెగించే వాళ్లూ మా దగ్గరా ఉన్నారు. పార్టీ కార్యాలయంపై దాడి వెనుక డీజీపీ హస్తం ఉంది.. అందుకే సీఐ నాయక్ పార్టీ కార్యాలయానికి వచ్చారు’ అని ఆరోపించారు.
‘ఏ ఒక్కర్నీ వదిలేదే లేదు. అధికారంలోకొచ్చిన 24 గంటల్లో భరతం పడతాం. అంకుశం రామిరెడ్డిని సినిమాల్లో బట్టలూడదీసి కొట్టినట్టు కొడతాం. చంద్రబాబుని కాదు.. రెండో వైపున్న లోకేషుని చూడండి.. మాడి మసైపోతారు జాగ్రత్త’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.