ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి.. ఇక, ఈ ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు.. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీపీపీ సమావేశం జరిగింది.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఎంపీ రామ్మోహన్ నాయుడు.. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఏపీకి నష్టం అన్నారు.. ఈ ఫలితాలు చూసి సీఎం జగన్ మరింత భయపడతారని జోస్యం చెప్పిన ఆయన.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేంద్రాన్ని అడగలేని పరిస్థితిలోకి జగన్ వెళ్తారన్నారు.. బీజేపీ బలపడే కొద్దీ తనపై ఉన్న కేసులతో కేంద్రాన్ని నిలదీయలేని పరిస్థితిలో సీఎం జగన్ ఉంటారన్న ఆయన.. జగన్ పై ఉన్న కేసుల భయంతో రాష్ట్రానికి రావాల్సిన హక్కులను వైసీపీ ఎంపీలు సైతం అడగలేరని ఆరోపించారు.
Read Also: AP: కొత్త జిల్లాల ఏర్పాటు.. దూకుడు పెంచిన ప్రభుత్వం
విభజన సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కులపై 28 మంది ఎంపీలున్నా వైఎస్ జగన్ ఇప్పటివరకు ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదని మండిపడ్డారు రామ్మోహన్నాయుడు.. అనేక రాష్ట్రాల్లో విజయం సాధిస్తున్న బీజేపీ.. ఏపీలో ఎందుకు బలపడట్లేదో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.. ఏపీ ప్రజలకు బీజేపీ చేయాల్సిన న్యాయం చేయలేదు కాబట్టే ఇక్కడ 1శాతం ఓటు కూడా రావట్లేదన్న ఆయన.. సంఖ్యా బలం తక్కువ ఉన్నా టీడీపీ ఎంపీలు రాష్ట్ర హక్కుల కోసం ఢిల్లీలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రాంతీయ పార్టీలు బలహీనపడుతున్నాయనే వాదనలో నిజం లేదన్న టీడీపీ ఎంపీ.. ప్రత్యేక హోదా, ఇతర విభజన హామీల సాధనలో వైసీపీపై ఒత్తిడి తెచ్చి హామీలు గుర్తు చేస్తామన్నారు.. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రాన్ని కొరతామన్న ఆయన.. కేంద్ర నిధులు దారి మళ్లించి రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్న తీరును పార్లమెంట్లో లేవనెత్తుతామని వెల్లడించారు. సర్పంచుల నిధులు కూడా దుర్వినియోగం చేసి జగన్ ప్రభుత్వం చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు హోంశాఖ చొరవ చూపాలని కోరతామని తెలిపారు ఎంపీ రామ్మోహన్నాయుడు.