ఏపీలో జిల్లాల విభజనపై ప్రతిపక్ష నేతలు స్పందిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు చేయడంపై ఇప్పటికే చంద్రబాబు, బాలకృష్ణ, పురంధేశ్వరి స్వాగతించారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా స్పందించారు. 2019 నుంచి జగన్ పాలనలో 100 పనులు చేస్తే అందులో 99 సుద్ద తప్పులు ఉన్నాయని… ఆ తప్పులతో జగన్ ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ప్రతి తప్పుకి ప్రజలను డైవర్ట్ చేయడం ఈ ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఇప్పటివరకు పెరిగిన ధరలకు సమాధానం లేదని.. రాష్ట్ర అప్పుల గురించి సమాధానం లేదని… ప్రత్యేక హోదాపై సమాధానం లేదని… ఉద్యోగుల సమస్యపై సమాధానం లేదని ఆరోపించారు.
అయితే ఏదైమైనా… జగన్ 99 తప్పులు చేసినా ఒకే ఒక్క మంచి పని చేశారని గోరంట్ల అభిప్రాయపడ్డారు. అది ఏంటంటే.. కృష్ణా జిల్లాను విభజించి ఎన్టీఆర్ పేరు పెట్టడమన్నారు. కృష్ణా జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయనున్న విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్టీఆర్ పేరు పెట్టడంపై మంత్రి కొడాలి నాని కూడా సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. అయితే విజయవాడకు సమీపంలోని గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను మచిలీపట్నం కేంద్రంగా ఉండే కృష్ణా జిల్లాలో కాకుండా ఎన్టీఆర్ జిల్లాలో కొనసాగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.