టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య జైళ్ళ శాఖ డీజీకి లేఖ రాశారు. న్యాయమూర్తి ఆదేశాలు లేకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీ ఎమ్మెల్సీ అనంతబాబుకు వీఐపీ సౌకర్యాలు కల్పిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. పెద్ద నేరస్తుడికి రాజమండ్రి సెంట్రల్ జైలు సిబ్బంది, అధికారులు స్టార్ హోటల్ సౌకర్యాలు కల్పిస్తున్నారు.
రిమాండ్ ఖైదీకి అటువంటి సౌకర్యాలు కల్పించేందుకు అనుమతి ఇవ్వలేదని కోర్టు అధికారులు చెప్తున్నారు.నిబంధనలకు విరుద్ధంగా అనంతబాబుకు ప్రత్యేక గది కేటాయించి, రెండు సెల్ఫోన్లతో నిత్యం బాహ్య ప్రపంచంతో సంభాషిస్తున్నట్లు తెలుస్తోంది. అనంతబాబును కలిసేందుకు ఎలాంటి రికార్డులు లేకుండానే సందర్శకులను అనధికారికంగా భారీ సంఖ్యలో అనుమతిస్తున్నారు. రాజమండ్రి స్టార్ హోటల్ నుంచి అనంతబాబుకు రోజూ భోజనం వస్తోందన్నారు వర్ల రామయ్య.
అనంత బాబు జైలునే కేంద్రంగా మార్చుకుని పలు వివాదాలకు పంచాయతీలు చేస్తున్నాడని రామయ్య ఆరోపించారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తోన్న జైలు అధికారులపై చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య జైళ్ల శాఖ డీజీని లేఖలో కోరారు. డ్రైవర్ సుబ్రహ్యణ్యం హత్యకేసులో నిందితుడైన అనంతబాబు జైలులో వున్న సంగతి తెలిసిందే.
