NTV Telugu Site icon

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ రెడ్డి గెలిచే పరిస్థితి లేదు..!

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ రెడ్డి గెలిచే పరిస్థితి లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అప్పుల కోసం విశాఖలో విలువైన, చారిత్రక భవనాలను తాకట్టు పెడుతున్నారని.. ఆదాయం పెంచకుండా ప్రజా ఆస్తులను అమ్మేస్తున్నారు, తాకట్టు పెడుతున్నారని.. చివరకు ప్రైవేటు ఆస్తులను కూడా తాకట్టు పెడతారేమో? అంటూ ఎద్దేవా చేశారు. అమరావతి ద్వారా వచ్చే రూ.2 లక్షల కోట్ల ప్రభుత్వ సంపదను నాశనం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ అధినేత.. అమరావతి ఉండుంటే 13 జిల్లాల అభివృద్ధికి నిధులు సమకూర్చి ఉండేదన్న ఆయన.. నూతన సిటీల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తున్నారు. ఆయా నిధులను అమరావతి ఉంటే వినియోగించుకునే వాళ్లం అన్నారు. ఉపాధి హామీ బిల్లుల బకాయిలు ఇవ్వకుండా కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురిచేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి సృష్టించారని మండిపడ్డ చంద్రబాబు.. ట్రూఅప్ ఛార్జీల పేరుతో ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారని మండిపడ్డారు.

లిక్కర్ పై రూ. 75వేల కోట్లు అప్పు చేస్తున్నారంటూ కామెంట్ చేశారు చంద్రబాబు.. ఆడబిడ్డల తాళిబొట్లతో కూడా ఆడుకునే పరిస్థితికి వచ్చారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ గా మార్చేందుకు టీడీపీ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపడతామని ప్రకటించారు.. సంక్షేమ కార్యక్రమాల్లో లబ్ధిదారుల సంఖ్యను కుట్ర పూరితంగా తగ్గిస్తూ అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్ రెడ్డి గెలిచే పరిస్థితి లేదని జోస్యం చెప్పారు. రాయలసీమలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తిచేసే పరిస్థితి కూడా లేదన్నారు చంద్రబాబు.