Seshachalam Forest : పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి సమీపంలోని శేషాచల అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగర శివార్లలోని జీవకోన అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, చూస్తుండగానే అడవి అంతటా విస్తరిస్తున్నాయి. ఎగిసిపడుతున్న మంటల ధాటికి అడవిలోని విలువైన వృక్షసంపద అగ్నికి ఆహుతవుతోంది.
గత కొద్ది రోజులుగా తిరుపతిలో ఎండల తీవ్రత విపరీతంగా పెరగడంతో, ఎండుగడ్డి రాపిడి వల్ల లేదా వేడి సెగలకు ఈ మంటలు అంటుకొని ఉంటాయని భావిస్తున్నారు. మంటల కారణంగా అడవి నుంచి దట్టమైన పొగ వెలువడి జీవకోన పరిసర ప్రాంతాలను కమ్మేసింది. దీంతో స్థానిక నివాసితులు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. మంటలను అదుపు చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే, అడవిలో గాలి వేగం ఎక్కువగా ఉండటంతో మంటలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వేగంగా విస్తరిస్తున్నాయి. ఇది అటవీ అధికారులకు పెద్ద సవాలుగా మారింది.
ఈ కార్చిచ్చు కారణంగా అడవిలోని మూలికా సంపదతో పాటు వన్యప్రాణులకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంటలను ఆర్పేందుకు అదనపు బలగాలను రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నారు.
