తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సంక్రాంతి పండగ ఏర్పాట్లు జరుగుతున్నాయి.. ఓవైపు సర్కార్, పోలీసులు నిఘా పెడుతున్నా కోడి పందాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.. పని చేస్తున్న ప్రాంతాన్ని వదిలి.. సొంత ఊరికి పరుగులు పెడుతున్నారు.. దీని కోసం ప్రత్యేక రైళ్లు, ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. ఇక, సంక్రాంతి పండుగ నేపథ్యంలో రేషన్ షాపుల ద్వారా పండగకు అవసరమైన సరుకులను కూడా పంపిణీ చేస్తూ ఉంటుంది సర్కార్.. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా రేషన్ వాహనాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే కాగా.. ప్రభుత్వ రేషన్ వాహనాల్లో సంక్రాంతి పండగ మామూళ్లు వసూళ్లు చేయడం చర్చగా మారింది.
Read Also: కోవిడ్ ఎఫెక్ట్… ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం వెల్ల గ్రామంలో ప్రభుత్వ రేషన్ వాహనంలో వసూళ్ల పర్వానికి తెరలేపారు.. దీని కోసం ప్రత్యేకంగా రేషన్ పంపిణీ వాహనంలో డబ్బా పెట్టి మరీ మామూళ్లకు పాల్పడుతున్నారు.. రూ.250 నుంచి 400 వరకు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.. పండగకు మామూళ్లు ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని బెదిరింపులకు దిగుతున్నారని చెబుతున్నారు.. మామూళ్లు ఇవ్వకపోతే పథకాలు ఆపేస్తామని.. కార్డులు రద్దు చేస్తామని హెచ్చరించినట్టు కూడా తెలుస్తోంది. అయితే, స్థానికంగా జనసేన పార్టీకి చెందిన ఓ నేత ఆ దృశ్యాలను ఫొటోలో, వీడియోలు తీసి వైరల్ చేశారు.. సోషల్ మీడియాతో ఆ వీడియోలు ఇప్పుడు రచ్చ చేస్తున్నరాయి.. బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాకృష్ణ నియోజకవర్గం పరిధిలో ఈ ఘటన వెలుగు చూడడం కూడా చర్చగా మారింది.. ఈ వ్యవహారం మంత్రిగారి దృష్టికి రావడంతో స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. దీంతో ఎండీయూ శివను తొలగిస్తామంటున్నారు తహసీల్దారు. మొత్తంగా.. రేషన్ వాహనంలో మామూళ్ల వ్యవహరం పెద్ద రచ్చగా మారింది.