ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలో ఆయన టీఆర్ఎస్ పార్టీతో పనిచేస్తున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ను కలిసి మంతనాలు కూడా జరిపారు. అయితే జాతీయ రాజకీయాల్లో ఆయన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరిగినా.. పలు రాష్ట్రాలలో ఇతర పార్టీలతో ఒప్పందాలు ఉన్న కారణంగా ఇది వర్కవుట్ కాదని తెలిసి వెనకడుగు వేశారు. ఈ మేరకు తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని ప్రశాంత్ కిషోర్ క్లారిటీ కూడా ఇచ్చారు.
అయితే ఏపీలో ప్రశాంత్ కిషోర్ గత ఎన్నికల్లో వైసీపీతో కలిసి పనిచేశారు. వచ్చే ఎన్నికలకు కూడా పీకేతోనే ఆ పార్టీ పనిచేస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందించారు. తాము ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకోవడం లేదని ప్రకటించారు. ఆయన సేవలకు బదులుగా థర్డ్ పార్టీ సేవలను వినియోగించుకుంటున్నామని సజ్జల తెలిపారు. అలాగే ఏ పార్టీతోనూ పొత్తు లేకుండానే వచ్చే ఎన్నికల బరిలో దిగుతామని చెప్పారు. కాగా 2019 ఎన్నికల్లో పీకే వ్యూహాలను పకడ్బందీగా అమలు చేసిన వైసీపీ రికార్డు స్థాయిలో విజయకేతనం ఎగురవేసింది. తాజాగా మరో రెండేళ్లలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పీకే సేవలను వినియోగించుకోవడం లేదంటూ వైసీపీ ప్రకటన చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.