వేసవి కాలం ప్రారంభం నుంచి భానుడి ప్రతాపానికి ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఉదయం నుంచే సూర్యుడు విరుచుకుపడుతుండడంతో మునుపెన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే తెలంగాణపై ఉపరితల ద్రోణి ఏర్పడడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న వేకువ జామున తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసాయి. దీంతో ఎండ తీవ్రత నుంచి ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. కానీ.. రైతులకు ఆపార నష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట.. కళ్లముందే నీటి పాలైంది. తెలంగాణలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు రైతులు తీసుకువచ్చిన ధాన్యం ఆకాల వర్షం కారణంగా తడిసి ముద్దైంది.
దీంతో రైతన్న కన్నీరు పెడుతున్నాడు. అయితే.. తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించి ఉండడంతో, తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. రైతులు, పశువుల కాపర్లు చెట్ల కింద ఉండొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.